కుప్పంలో టీడీపీని ఓడించలేదు.. ప్రజాస్వామ్యాన్ని ఓడించారు...

శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (07:54 IST)
ఏపీలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో భాగంగా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహించే కుప్పం నియోజకవర్గంలో ఆ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. వైకాపా అభ్యర్థులు విజయభేరీ మోగించారు. దీనిపై చంద్రబాబు నాయుడు స్పందించారు. పంచాయతీ ఎన్నికల్లో అర్థరాత్రి అక్రమాలతో ప్రజాస్వామ్యాన్ని దారుణంగా హతమార్చారని మండిపడ్డారు. 
 
ఓట్ల లెక్కింపును కూడా ఇష్టానుసారం మార్చివేసి టీడీపీ గెలిచిన పంచాయతీలను కూడా వైసీపీ ఖాతాలో వేసుకొన్నారని, అధికార పక్ష ఉన్మాదులు... రౌడీల స్వైర విహారాన్ని ఎన్నికల కమిషన్‌ కూడా ఆపలేకపోయిందని చంద్రబాబు విమర్శించారు. 
 
పంచాయతీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు రాత్రిపూట వద్దని, పగలు జరపాలని మేం కోరాం. ఎన్నికల కమిషన్‌ పట్టించుకోలేదు. లెక్కింపు ప్రక్రియను కెమెరాలతో రికార్డు చేయాలని ఎన్నికల కమిషన్‌ చెప్పింది. దానిని ఎక్కడా పాటించలేదు. రాత్రిపూట ఓట్ల లెక్కింపు సమయంలో కరెంటు పోయిందనే సాకుతో కొన్నిచోట్ల ఫలితాలు అడ్డగోలుగా మార్చేశారు. 
 
నిబంధనల ప్రకారం రెండు అంకెల్లో మెజారిటీ ఉన్నచోట రీకౌంటింగ్‌ అవసరం లేదు. రీ కౌంటింగ్‌ కూడా ఒకసారి మాత్రమే జరపాలి. కానీ మూడు, నాలుగు సార్లు రీకౌంటింగ్‌ జరిపి వైసీపీ గెలిచిందని ప్రకటించేశారు. రాత్రివేళ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. మూడో విడత ఫలితాల్లో సాయంత్రం ఏడు గంటల వరకూ టీడీపీ ఆధిక్యం ఉందని ప్రభుత్వ అనుకూల టీవీలతోసహా అందరూ చూపించారు. 
 
ఆ తర్వాత డ్రామా మొదలైంది. తొమ్మిదిన్నరకు వైసీపీకి  కొద్ది ఆధిక్యం చూపించారు. ఆతర్వాత ఫలితాలను ఏకపక్షంగా మార్చేశారు. టీడీపీ గెలిచిన పంచాయతీల్లో వైసీపీ గెలిచినట్లుగా ఫలితాలను మార్చేశారు అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు