పులివెందుల గడ్డపై చంద్రబాబు ఫైర్.. చికెన్‌ కొట్టులోనూ వైకాపా ఎమ్మెల్యే వసూళ్లు

బుధవారం, 2 ఆగస్టు 2023 (16:31 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందులలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైఎస్ జగన్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. టీడీపీ హయాంలో రాయలసీమ ప్రాజెక్టులకు రూ.12వేల కోట్లు ఖర్చు చేస్తే, వైకాపా పాలనలో సీఎం జగన్‌ కేవలం రూ.2 వేల కోట్లే ఖర్చు చేశారని ఆరోపించారు.
 
'సాగునీటి ప్రాజెక్టుల సందర్శన'లో భాగంగా వైఎస్‌ఆర్‌ జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు.. జమ్మలమడుగు సర్కిల్‌లో నిర్వహించిన రోడ్‌షోలో మాట్లాడారు. ఈ సందర్భగా సీఎం జగన్‌, వైకాపాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక వైకాపా ఎమ్మెల్యే చికెన్‌ కొట్టులోనూ వసూళ్లకు పాల్పడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. సీఎం జగన్‌కు ప్రజలను దోచుకోవాలనే తప్ప.. మేలు చేయాలనిలేదని విమర్శించారు. 
 
జగన్‌ కొత్తగా ఒక్క ప్రాజెక్టయినా తెచ్చారా? ఒక్క ఎకరానికైనా నీళ్లిచ్చారా? అని ప్రశ్నించారు. జమ్మలమడుగు ప్రజల కోసం తెదేపా నేత భూపేష్‌ పనిచేస్తారని చంద్రబాబు చెప్పారు. మరోవైపు, పులివెందులలో తెదేపా ఫ్లెక్సీలను కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు చించివేశారు. టీడీపీ ఎమ్మెల్సీ రామ్‌గోపాల్‌రెడ్డి నివాసానికి సమీపంలో ఇది జరిగింది. తెదేపా నాయకులు వారిని వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు