భలే బురిడీ కొట్టించారయ్యా.. లేదంటే నా కొంప మునిగేది... కుప్పం నేతలతో చంద్రబాబు

మంగళవారం, 4 జూన్ 2019 (11:19 IST)
ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎదురైన ఎన్నికల ఫలితాలపై ఆ పార్టీ నేతలు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులోభాగంగా తన సొంత నియోజకవర్గమైన కుప్పం అసెంబ్లీ స్థానంపై టీడీపీ అధినేత, కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు స్థానిక పార్టీ నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇపుడు ఆసక్తికరంగా మారాయి. పరోక్షంగా ఆ పార్టీ నేతలకు చురక అంటించినట్టుగా ఉన్నాయి. 
 
అమరావతి ఉండవల్లిలోని తన నివాసంలో చంద్రబాబు ఈ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో చంద్రబాబు స్థానిక నేతలతో మాట్లాడుతూ, మొత్తానికి 'భలే బురిడీ కొట్టించారయ్యా' అంటూ నవ్వుతూ వ్యాఖ్యానించారు. ఈ మాటలు నవ్వుతూ వ్యాఖ్యానించినప్పటికీ పార్టీ నేతలకు మాత్రం తమను ఉద్దేశించే బాబు వ్యాఖ్యలు చేశారని నొచ్చుకున్నారు. 
 
కుప్పం స్థానం నుంచి పోటీ చేసిన చంద్రబాబు.. ఓట్ల లెక్కింపు సమయంలో ఒక దశంలో వైకాపా అభ్యర్థి కంటే వెనుకపడ్డారు. ఆ తర్వాత రౌండ్‌లో ఆధిక్యం సాధించి గెలుపొందారు. అయితే, క్రితంసారితో పోల్చితే ఆయన మెజార్టీ బాగా తగ్గింది. 
 
దీనిపై స్థానిక నేతలు మాట్లాడుతూ, కుప్పంలో కొందరి నేతల వ్యవహారశైలి వల్లే ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందని ఆరోపించారు. ఏరియా, కోర్ కమిటీల నాయకత్వాన్ని మార్చి పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని వారు సూచించారు. 
 
దీనికి చంద్రబాబు స్పందిస్తూ, 'ఈ నెలాఖరున నేను కుప్పం వచ్చి మూడు నాలుగు రోజులు అక్కడే ఉంటాను. అపుడు అటు జనాలను విస్తృతంగా కలవడంతో పాటు పార్టీలో కూడా ప్రక్షాళన అవసరమైతే చేస్తాను. ఐ విల్ టేక్ కేర్' అంటూ భరోసా ఇచ్చారు. పైగా, 'ఎవరూ అధైర్యపడొద్దు. నేనున్నా.. భవిష్యత్తు మనదే' అంటూ నేతలకు, కార్యకర్తలు చంద్రబాబు భరోసా ఇచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు