రౌడీ రాజ్యాన్ని తరిమికొట్టాలి : దేవినేని ఉమ

మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (16:27 IST)
వైసీపీ నాయకుల రౌడీ రాజ్యాన్ని తరిమికొట్టాలని  టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. మంగళవారం మైలవరం గ్రామ పంచాయతీ తెలుగు దేశం పార్టీ అభ్యర్థి సగ్గుర్తి సౌందర్యని గెలిపించాలని ఇంటింటికీ తిరిగి  ఓట్లను అభ్యర్థించారు. తెలుగుదేశం అభ్యర్థులను గెలిపించాలని కోరారు. 
 
ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ నిమ్మాడలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్ట్ అన్యాయమన్నారు. అచ్చెన్న అరెస్ట్‌ను ఖండించారు. రాష్ట్రానికి ఎన్ని నిధులు తెచ్చారో సీఎం జగన్, ఎంపీ విజయసాయి‌రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష పార్టీ నాయకులపై జగన్ ప్రభుత్వం కక్ష కట్టి కేసులు పెడుతుందని దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.
 
అధికార దుర్వినియోగానికి పరాకాష్ట: గొట్టిపాటి 
 
రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతల అరాచకాలు శ్రీకాకుళం దగ్గర నుంచి చిత్తూరు వరకు ప్రతి రోజు జరుగుతున్నాయని టీడీపీ నేత గొట్టిపాటి రామకృష్ణ అన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్టుపై స్పందించిన ఆయన  మాట్లాడుతూ రౌడీయీజం, గూండాయీజం, భయాభ్రాంతులకు గురిచేయడం ద్వారా రాజకీయ ఆధిపత్యం సాధించిన సంఘటనలు దేశంలో ఎక్కడా జరగలేదని అన్నారు. 
 
నిమ్మాడలాంటి ప్రశాంత వాతావరణంలో అక్రమ అరెస్టులు చేస్తున్నారని, వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్, ఆయన అనుచరులు నిమ్మాడ రోడ్డుపై మారణాయుధాలతో వీరంగం సృష్టిస్తే పోలీసులు కనీసం కేసులు కూడా పెట్టలేదని ఆయన విమర్శించారు. అచ్చెన్న తన బంధువుతో ఫోన్‌లో మాట్లాడి ఒప్పించే ప్రయత్నం చేస్తే కేసులు పెట్టి అరెస్టు చేయడం అంటే అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని అన్నారు. 
 
ఈ విధంగా పోలీసులు, ప్రభుత్వం తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. దీనికి ప్రభుత్వం తప్పకుండా మూల్యం చెల్లించే రోజు వస్తుందని గొట్టిపాటి రామకృష్ణ అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు