రాజకీయాలకు స్వస్తి చెప్పిన మాజీ ఎంపీ మురళీ మోహన్

సోమవారం, 25 జనవరి 2021 (10:32 IST)
ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ మురళీమోహన్ రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ఇకపై తనకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అలాగే తన భవిష్యత్తు కార్యచరణ ఏమిటనే వివరాలను ఓ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రస్తుతం తన దృష్టి సినిమాలపైనే ఉందని మురళీమోహన్ తెలిపారు. తాను సినిమాల నుంచి ఎదిగిన వాడినని.. అందుకే దానిని మరిచిపోనని చెప్పారు. 
 
మళ్లీ సినిమా రంగంలో పూర్తిగా కనిపించనున్నట్టు వెల్లడించారు. తన వ్యాపారాలను తమ్ముడు, పిల్లలకు అప్పగించినట్టు తెలిపారు. ఇటీవల తనకు వెన్నెముక శస్త్ర చికిత్స జరిగింది.. ప్రస్తుతం దాన్ని నుంచి పూర్తిగా కోలుకున్నానని చెప్పారు. తన జయబేరి ఆర్ట్స్‌లో ఇప్పటివరకు 25 సినిమాలను నిర్మించామని తెలిపారు. అతడు తమ సంస్థ నుంచి వచ్చిన చివరి చిత్రమని.. ఆ తర్వాత రాజకీయాలు, వ్యాపారాల్లో బిజీ అయిపోవడంతో సినిమాలు నిర్మించలేకపోయామని చెప్పారు.
 
ప్రస్తుతం తన దృష్టి అంతా సినిమాలు నిర్మించడంతో పాటుగా నటనపైనే ఉందన్నారు. దాదాపు 10 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ పూర్తి స్థాయి సినిమాల్లో నటిస్తున్నట్టు చెప్పారు. తాజాగా ఆర్కా మీడియా నిర్మిస్తున్న వెబ్ సిరీస్‌లో నటిస్తున్నట్టు చెప్పారు. అందులో జగపతిబాబు, శరత్‌ కుమార్‌ అన్నదమ్ములుగా నటిస్తున్నారని.. వారికి తండ్రి పాత్రలో తాను నటిస్తున్నట్టు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు