కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యం కాదు.. తేల్చేసిన కేంద్రం

బుధవారం, 13 జూన్ 2018 (19:02 IST)
రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ, ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేసిన నేపథ్యంలో, తెలుగు రాష్ట్రాల ఆశలపై కేంద్రం మరోసారి నీళ్లు చల్లింది. బయ్యారం ఉక్కు కర్మాగారంతో పాటు కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యం కాదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీం కోర్టులో అఫడవిట్ దాఖలు చేసింది.
 
విభజన హామీల అమలుపై తెలంగాణ కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. అందులో ఏపీ, తెలంగాణలో స్టీల్ ఫ్యాక్టరీల నిర్మాణం సాధ్యం కాదనే రిపోర్టులు వచ్చాయని కేంద్రం తెలిపింది. అయినా మరో టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తామని కేంద్రం తెలిపింది. 
 
ప్రస్తుతం మెకాన్ సంస్థ కడపలో స్టీల్ ఫ్యాక్టరీ సాధ్యాసాధ్యాలపై పరిశీలన జరుపుతోందని, ఆ సంస్థ పూర్తిస్థాయి నివేదిక ఇవ్వలేదని కేంద్రం కోర్టుకు తెలిపింది. మెకాన్ సంస్థ రెండు రాష్ట్ర ప్రభుత్వాలతోనూ సమాచారం పంచుకుంటోందని, కడప స్టీల్ ప్లాంట్‌తో పాటు బయ్యారం వ్యవహారం కూడా టాస్క్ ఫోర్స్ పరిధిలో ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది.
 
విభజన చట్టంలో సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని మాత్రమే ఉందని కేంద్రం స్పష్టం చేసింది. అలాగే తొలి ఆరు నెలల్లోనే బయ్యారం, కడప స్టీల్ ఫ్యాక్టరీ సాధ్యం కాదని తేల్చేసినట్లు కేంద్రం అఫిడవిట్‌లో పేర్కొంది. అంతేగాకుండా కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని స్పష్టమైన నివేదిక ఆధారంగా సాధ్యంకాదని తేల్చేసినట్లు కేంద్రం తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు