ఓటరుపై చేయి చేసుకున్న తెనాలి వైకాపా అభ్యర్థి శివకుమార్ గృహనిర్బంధం!

ఠాగూర్

సోమవారం, 13 మే 2024 (16:57 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో భాగంగా, తెనాలి వైకాపా అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్‌పై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఆయన్ను అదుపులోకి తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. పోలింగ్‌ పూర్తయ్యే వరకు శివకుమార్‌ను గృహనిర్బంధంలోనే ఉంచాలని పేర్కొంది. ఆయన సోమవారం ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. అప్పటికే అనేక మంది ఓటర్లు క్యూలో నిలబడివున్నారు. వారిని ఏమాత్రం పట్టించుకోకుండా నేరుగా వెళ్లడంపై ఓటరు అభ్యంతరం చెప్పారు. దీంతో ఆగ్రహానికి గురైన శివకుమార్‌.. ఓటరు చెంపపై కొట్టారు. వెంటనే ప్రతిఘటించిన ఓటరు.. వైకాపా అభ్యర్థి చెంప చెళ్లుమనిపించారు. అనంతరం శివకుమార్‌ అనుచరులు ఓటరుపై విచక్షణారహితంగా దాడికి దిగారు. ఈ ఘటన ఎన్నికల సంఘం దృష్టికి వెళ్లడంతో చర్యలు తీసుకుంది. శివకుమార్‌ నియోజకవర్గంలో పర్యటించకుండా అదుపులోకి తీసుకుని గృహ నిర్బంధంలో ఉంచాలని ఆదేశించింది. 
 
తెలుగు రాష్ట్రాల్లో ప్రశాంతంగా పోలింగ్... : ఏపీలో 55, తెలంగాణాలో 52 శాతం 
 
సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌లో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా సాగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకు, తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో సోమవారం ఓటింగ్‌ జరుగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. మధ్యాహ్నం మూడు గంటల వరకు ఏపీలో 55.49 శాతం, తెలంగాణలో 52.34 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
 
ఏపీ పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో అత్యధికంగా చిత్తూరులో 61.43 శాతం, అత్యల్పంగా విశాఖపట్నంలో 47.66 శాతం పోలింగ్‌ నమోదైంది. తెలంగాణలో అత్యధికంగా జహీరాబాద్‌లో 63.96 శాతం, అత్యల్పంగా హైదరాబాద్‌లో 29.47 శాతం ఓటింగ్‌ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఏపీలో పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. తెలంగాణలో పోలింగ్‌ ప్రశాంతంగా సాగుతోంది. 
 
నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలందరూ కదిలివచ్చి ఓటేయండి : సీఎం జగన్ ట్వీట్ 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ ప్రశాంతంగా సాగుతుంది. ఈ పోలింగ్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూకడుతున్నారు. ఓటర్ల చైతన్యం వెల్లివిరిసిందనిపించేలా పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తండోపతండాలుగా తరలివస్తున్నారు. 
 
ఫలితంగా ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. విభజన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే మూడో ఎన్నికలు ఇవి. గత రెండు ఎన్నికలతో పోల్చుకుంటే ఈ దఫా మాత్రం సుదూర ప్రాంతాల నుంచి సైతం ఏపీ ఓటర్లు ఎక్కువ సంఖ్యలో తమ స్వస్థలాలకు చేరుకున్నారు. దీంతో పోలింగ్ శాతం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని ఎన్నికల సంఘం అధికారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ ఓ ట్వీట్ చేశారు. 
 
అన్ని వర్గాల ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఈ మేరకు ఆయన తన ట్విటర్ వేదికగా ట్వీట్ చేశఆరు. "నా అవ్వతాతలందరూ, నా అక్కచెల్లెమ్మలందరూ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలందరూ.. అందరూ కదిలి రండి. తప్పకుండా ఓటు వేయండి" అంటూ తన సందేశం ఇచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు