కరోనా ప్రభావం ఆక్వా రైతులపై ఉండదు: మంత్రి మోపిదేవి

సోమవారం, 23 మార్చి 2020 (21:55 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ రాష్ట్రంలో అదుపులోనే ఉందని, ఆక్వారంగం రైతులు దళారుల మాటలను నమ్మి మోసపోవద్దని  రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్యశాఖ మంత్రి  మోపిదేవి వెంకట రమణారావు పేర్కొన్నారు. సచివాలయంలోని ప్రచార విభాగంలో సోమ‌వారం మంత్రి మీడియా సమావేశం నిర్వహించారు.

ఇతర దేశాల నుంచి గడచిన రెండు నెలల్లో ఆంధ్రప్రదేశ్ కు 13వేలమంది వచ్చారని అందులో కేవలం ముగ్గురికి మాత్రమే కరోనా ఉందని నిర్ధారణ అయినట్లు మంత్రి వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ముందు చూపుతో వైద్య ఆరోగ్యశాఖ, ఇతర శాఖలను అప్రమత్తం చేయడంతో రాష్ట్రంలో పెద్దగా ప్రభావం చూపలేదన్నారు. అయితే కరోన వైరస్ వ్యాప్తిపై దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపు మేరకు దేశంలో జనతా కర్ఫ్యూ విజయవంతమైందన్నారు.

ప్రజలు స్వచ్ఛందంగా ఇళ్ళకే పరిమితమై సమైక్యతను చాటారని పేర్కొన్నారు. ఇప్పటికే కరోనా మహమ్మారి నుంచి ఉపశమనం పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన బలమైన గ్రామ సచివాలయ వ్యవస్థలో పనిచేస్తున్న వాలంటీర్లు లక్షలాది కుటుంబాలను సర్వేచేయడం, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో కరోన వైరస్ ప్రభావం తీవ్రత తగ్గిందని వెల్లడించారు.

వాలంటీర్లు అందించిన సేవలు అమోఘమని మంత్రి కొనియాడారు. విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలను ఎప్పటికప్పడు తెలుసుకోవడం,  వారిని ఐసోలేషన్ వార్డులకు పంపి   చికిత్స అందించడం అనంతరం ఇంటికి పంపిచడం జరుగుతుందని తెలిపారు. వాలంటీర్లు, ఆశా కార్యకర్తలు, వైద్యశాఖ సిబ్బంది ప్రజల్లో చైతన్యం తేవాల్సిన ఆవశ్యకతను మంత్రి గుర్తుచేశారు. ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకులు, వస్తువుల సరఫరాలో ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి ప్రకటించారు.

దీనిపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను మంత్రి ఖండించారు. కరోన వైరస్ వలన ఆక్వారంగ పరిశ్రమలు మూతపడతాయని వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని మంత్రి వెల్లడించారు. కరోనా ప్రభావంతో ఆక్వా, మత్స్య, ఫౌల్ట్రీ రంగాలు దెబ్బతిన్నాయని తెలిపారు. ఇప్పటికే ఫౌల్ట్రీ రంగం ఒడిదుడుకులు ఎదుర్కొంటుందని అన్నారు. ఆక్వా రంగంలో ప్రధానంగా మూడు రకాలు ఉన్నాయని తెలిపారు.

సీడ్ వేయడం, ఫీడ్ ను అందించడం, ప్రాసెసింగ్ నిర్వహణ వంటి అంశాలను మంత్రి ప్రస్తావించారు. యూరప్ దేశాల్లో అత్యధికంగా ఆక్వా రంగ ఎగుమతులు చైనా తరువాత భారత్ దే తొలిస్థానమని పేర్కొన్నారు. అది కూడా మన రాష్ట్రం నుంచే ఆక్వా ఎగుమతులు అత్యధికంగా ఉంటున్న అంశాన్ని మంత్రి తెలిపారు. గత పది రోజుల నుంచి తిరిగి ఆక్వా ఎగుమతులు మన రాష్ట్రం నుంచి పునః ప్రారంభమయ్యాయని మంత్రి వెల్లడించారు.

ఆక్వా రంగంలో ఎటువంటి ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుందన్నారు. సకాలంలో ఆక్వా ఉత్పత్తులు  అమ్మకాల కోసం ఇతర ప్రాంతాలకు సకాలంలో తరలి పోకుంటే ఆక్వారైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని అన్నారు. దీనిపై ఇప్పటికే సంబంధిత శాఖాధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చామని అన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు, రవాణాశాఖ, చెక్ పోస్టు అధికారులకు ఆక్వా రవాణాకు ఎక్కడా ఇబ్బందులు పెట్టడానికి వీలు లేదని మంత్రి ఆదేశించానన్నారు.

ఈ విషయంపై రైతులు ఆందోళన చెందనవసరం లేదని స్పష్టం చేశారు. మధ్య వర్తుల కారణంగా రైతులు ఆందోళన పడుతున్న విషయం ప్రభుత్వం దృష్టికి రావడంతో వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. సకాలంలో ఆక్వా ఉత్పత్తుల అమ్మకాలు చేసుకునేందుకు  అధికారులు సహకరించాలని కోరారు. రైతులు తమ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరను కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.

రాష్ట్రంలో ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్లు షట్ డౌన్ చేస్తున్నారని మధ్యవర్తులు చేస్తున్న ఆరోపణల్లో ఎంతమాత్రం వాస్తవం లేదని తెలిపారు. కరోనా వైరస్ రైతులకు సోకుండా ప్రాసెసింగ్ యూనిట్లలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలిచ్చామన్నారు. మధ్యవర్తులు రైతుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు