వైసీపీ పాలనలో ప్రజల ప్రాణాలకు రక్షణ లేదు: నిమ్మకాయల చినరాజప్ప

ఆదివారం, 12 జులై 2020 (17:53 IST)
వైసీపీ అధికారంలోకి వచ్చాక సామాన్య ప్రజలపై దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయాయి, రాష్ర్టంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మండిపడ్డారు.

"సామాన్య ప్రజల నుంచి టీడీపీ కార్యకర్తలు, ప్రభుత్వ ఉద్యోగులపై వైసీపీ నాయకులు, కార్యకర్తలు దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. పేదలను బెదిరించి బలవంతంగా భూములు లాక్కుంటున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన 13 నెలల్లోనే 800 మంది టీడీపీ కార్యకర్తలపై దాడులు చేశారు. 11 మందిని హత్య చేశారు. 

వైసీపీ నేతల వేదింపుల తట్టుకోలేక 7 గురు ఆత్మహత్య చేసుకున్నారు" అని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ర్టంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందన్నారు. మహిళలు, చిన్నారులపై  సుమారు 210 అత్యాచారాలు జరిగాయన్నారు.  వైసీపీ పాలనలో ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు.

"వైసీపీ పాలనలో ప్రజలకు స్వేచ్చ లేకుండా పోయింది,  డా. బి.ఆర్ అంబేద్కర్ 2 సం.11 నెలల 18 రోజుల పాటు కష్టపడి రాజ్యాంగం రచించి ప్రజలకు వాక్ స్వాతంత్ర్యం, భావప్రకటన హక్కును కల్పిస్తే..జగన్ ముఖ్యమంత్రి అయిన మెదటి రోజే  వాటిని హరించి వేశారు. జగన్ పోలీసు వ్యవస్ధను దుర్వినియోగం చేస్తున్నారు.

ఓ వైపు వైసీపీ అవినీతిని, అక్రమాలను ప్రశ్నిస్తున్న టీడీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు, మరో వైపు   ప్రభుత్వ వైపల్యాల్ని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న వారిపై కేసులు పెడుతున్నారు. తప్పులు ఎత్తిచూపితే సరిదిద్దుకోవాలి కానీ  తప్పుడు కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం?" అని నిమ్మకాయల చినరాజప్ప ప్రశ్నించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు