పెళ్ళయి మూడునెలలే, భర్త చనిపోతే అంత్యక్రియలను వీడియో కాల్‌లో చూసిన భార్య

శుక్రవారం, 1 మే 2020 (21:35 IST)
కరోనా వైరస్ కారణంగా ఎన్నో జీవితాలు ఛిద్రమవుతున్నాయి. నిరుపేదల విషయాన్ని అటుంచితే కొత్తగా పెళ్ళయిన వారి సంగతి మరీ దారుణంగా వుంటోంది. భార్య ఒక దగ్గర ఉంటే భర్త మరో దగ్గర ఉండటం నరకయాతనే. అలాంటి పరిస్థితే ఎదురైంది ఒక మహిళకు. కానీ చివరకు భర్తనే పోగొట్టుకుని కన్నీటిపర్యంతమైంది.
 
విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం గోవిందపురానికి చెందిన నరేష్‌కు, శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరంకు చెందిన జ్యోతినిచ్చి మూడునెలల క్రితం వివాహం చేశారు. అయితే పెళ్ళయిన తరువాత కొన్నిరోజుల పాటు అత్తవారింట్లో ఉన్న నరేష్ లాక్‌డౌన్ ముందు తన ఇంటికి వచ్చేశాడు. 
 
అయితే లాక్‌డౌన్ ప్రారంభం కావడంతో భార్య వద్దకు వెళ్ళలేకపోయాడు. ఇంట్లోనే ఉండిపోయాడు. రోజూ భర్తతో ఫోన్లో మాట్లాడుతూ ఉండేది భార్య. అయితే సరిగ్గా వారంరోజుల క్రితం కూరగాయల కోసం ఇంటి నుంచి మోటారు సైకిల్ పైన వెళ్ళిన నరేష్ కిందపడిపోయాడు. తలకు తీవ్రగాయాలైంది. అతన్ని ఆసుపత్రిలో చేర్పించారు.
 
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా భార్య రాలేని పరిస్థితి. నిన్న చికిత్స పొందుతూ మరణించాడు. అయితే అంత్యక్రియలకు కూడా ఆమె రాలేకపోయింది. కారణం ఆమె ఉండే ప్రాంతం రెడ్ జోన్. ఇంటి నుంచి ఎవరినీ బయటకు పంపించలేదు పోలీసులు. దీంతో ఆమె చివరకు తన భర్త అంత్యక్రియలను వీడియో కాల్ ద్వారా చూస్తూ బోరున విలపించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు