ప్రభుత్వ పింఛన్ కోసం పుట్టుకొచ్చిన అంగవైకల్యం : వైకాపా సర్పంచ్ దంపతుల బాగోతం!!

వరుణ్

మంగళవారం, 2 జులై 2024 (16:25 IST)
ప్రతి నెలా ప్రభుత్వం ఇచ్చే సామాజిక పించన్లను పొందేందుకు వైకాపాకు చెందిన ఓ మహిళా సర్పంచ్, ఆమె భర్త పాల్పడిన అక్రమ బాగోతం వెలుగులోకి వచ్చింది. పించన్ కోసం అంగ వైకల్యం ఉన్నట్టుగా చూపించి పించన్లు పొందుతూ వచ్చారు. తాజాగా ఏపీలో కొత్తగా ఏర్పాటైన ఎన్డీయే ప్రభుత్వంలో వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ముంగిళిపట్టు పంచాయతీలో పింఛన్ల అక్రమ బాగోతం వెలుగు చూసింది. వైకాపా సర్పంచి జాగర్లమూడి భారతి దంపతులతోపాటు మరో 20 మంది వరకు అక్రమంగా పింఛన్లు పొందుతున్నట్లు టీడీపీ నాయకులు వెల్లడించారు. టీడీపీ సూపర్ సిక్స్ పథకాల అమలులో భాగంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీని సోమవారం ఉదయాన్నే సచివాలయ సిబ్బంది, స్థానిక తెదేపా నాయకుల సమక్షంలో చేపట్టారు. 
 
ఎలాంటి వైకల్యం లేకున్నా ప్రతినెలా పింఛన్లు తీసుకుంటున్న ముంగిళిపట్టు సర్పంచి భారతి, ఆమె భర్త దామోదరం నాయుడి పేర్లను చూసి వారు అవాక్కయ్యారు. వీరితోపాటు మరో 20 మంది వరకు వైకాపా సానుభూతిపరులు పింఛన్లు తీసుకుంటున్నట్లు వారు వెల్లడించారు. వాలంటీర్ల అండతో ఇంతకాలం గుట్టుచప్పుడుకాకుండా పింఛన్లు పొందగా సచివాలయ సిబ్బందితో పంపిణీ చేపట్టడంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
 
సర్పంచి దంపతులు ఎంతకాలం నుంచి పింఛన్లు పొందుతున్నారన్నదానిపై విచారణ చేపట్టి చర్యల నిమిత్తం కలెక్టర్ దృష్టికి తీసుకువెళతామని, గ్రామసభ నిర్వహించి అనర్హులు ఇంకెంత మంది ఉన్నారో విచారించి తొలగిస్తామని చంద్రగిరి ఎంపీడీవో సూర్యసాయి తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు