నేడు వైఎస్ వర్థంతి వేడుకలు - ఆహ్వానం అందినా దూరంగా వైకాపా నేతలు

గురువారం, 2 సెప్టెంబరు 2021 (08:20 IST)
మహానేత దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి వర్థంతి వేడుకలు నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా వైఎస్ అభిమానులు ఉన్న ప్రతి రాష్ట్రంలోనూ జరుగుతున్నాయి. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలో వైఎస్ఆర్ సతీమణి వైఎస్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో గురువారం వైఎస్ వర్థంతి సభ నిర్వహించనున్నారు. 
 
ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటూ వైఎస్సార్‌తో గతంలో పనిచేసిన, సన్నిహితంగా మెలిగిన నేతలను విజయమ్మ ఆహ్వానించారు. వీరిలో ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి తదితరులు కూడా ఉన్నారు. 
 
అయితే, ఆహ్వానాలు అందినప్పటికీ పార్టీ నిర్ణయం మేరకు వర్ధంతి సభకు వెళ్లకూడదని వైసీపీ నేతలు నిర్ణయించినట్టు తెలుస్తోంది. అలాగే, గతంలో వైఎస్‌తో కలిసి పనిచేసి ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ వంటి పార్టీల్లో ఉన్న దాదాపు 350 మంది తెలంగాణ నేతలను కూడా ఈ సభకు ఆహ్వానించారు.
 
ఆహ్వానం అందుకున్న తెరాస నేతలు ప్రస్తుతం ఢిల్లీలో ఉండడంతో వారు రాలేకపోవచ్చని, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, కేవీపీ రామచంద్రరావు వంటి వారు సభకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. కాగా, ఈ సభను వైఎస్ కుమార్తె, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సమన్వయం చేసే అవకాశం ఉంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు