బెయిల్ పిటిషన్ వాయిదా ... సీఎం జగన్‌కు జూలై ఒకటి వరకు ఊరట

సోమవారం, 14 జూన్ 2021 (15:01 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డికి తాత్కాలిక ఊరట లభించింది. ఆయన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై తదుపరి విచారణను వచ్చే నెల ఒకటో తేదీకి సీబీఐ ప్రత్యేక కోర్టు వాయిదావేసింది. 
 
అక్ర‌మాస్తుల కేసులో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ అసంతృప్త ఎంపీ రఘురామ కృష్ణరాజు వేశారు. దీనిపై సోమవారం నాంప‌ల్లిలోని సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిష‌న్‌పై ఇప్ప‌టికే జ‌గ‌న్ త‌ర‌ఫు న్యాయ‌వాదులు కౌంట‌ర్ దాఖ‌లు చేసి, ఈ పిటిష‌న్‌ను కొట్టేయాల‌ని కోరిన విష‌యం తెలిసిందే. 
 
అయితే, ఆ కౌంట‌ర్‌పై ర‌ఘురామ‌కృష్ణ‌రాజు రిజాయిండ‌ర్ దాఖ‌లు చేశారు. కౌంట‌ర్‌లో జ‌గ‌న్ అస‌త్య‌పు ఆరోపణ‌లు చేశార‌ని తెలిపారు. త‌న‌కు పిటిష‌న్ వేసే అర్హ‌త లేద‌న‌డం అసంబ‌ద్ధ‌మ‌న్నారు. పిటిష‌న్ విచార‌ణ అర్హ‌త‌ల‌పై కోర్టులు ఇప్ప‌టికే స్ప‌ష్ట‌త‌నిచ్చాయ‌ని వివ‌రించారు. 
 
రఘురామ తనపై ఉన్న సీబీఐ కేసులను ప్రస్తావించలేదని జ‌గ‌న్ పేర్కొనడం స‌రికాద‌న్నారు. త‌న‌పై కేవ‌లం ఎఫ్ఐఆర్‌లు న‌మోద‌య్యాయ‌ని, చార్జిషీట్ దాఖ‌లు చేయ‌లేద‌ని ఆయ‌న వివరించారు. జ‌గ‌న్ ఆరోప‌ణ‌లు దెయ్యాలు వేదాలు వ‌ల్లించి‌న‌ట్లు ఉంద‌ని పేర్కొన్నారు. 
 
కాగా, వాద‌న‌ల‌కు స‌మ‌యం ఇవ్వాల‌ని జ‌గ‌న్ త‌ర‌రు న్యాయ‌వాది కోర్టును కోరారు. దీంతో జులై 1కి విచార‌ణ‌ను వాయిదా వేస్తున్న‌ట్లు సీబీఐ కోర్టు ప్ర‌క‌టించింది. అప్పటివరకు జగన్‌కు తాత్కాలిక ఊరట లభించినట్టే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు