తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థిగా కె. కవిత.. నేడు నామినేషన్

బుధవారం, 18 మార్చి 2020 (11:31 IST)
నిజామాబాద్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ తెరాస అభ్యర్థిగా మాజీ ఎంపీ కవిత పేరు ఖరారైంది. ఆమె అభ్యర్థిత్వాన్ని టీఆర్‌ఎస్ పార్టీ బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఆమె బుధవారమే నామినేషన్ చేయనున్నట్లు ఆ పార్టీ వెల్లడించింది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవిత అభ్యర్థిత్వం ఖరారు కావడంతో నిజామాబాద్ జిల్లాలో రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారిపోయాయి. 
 
నిజామాబాద్ ఎంపీగా అయిదేళ్ల పాటు పనిచేసిన ఆమె అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. పార్టీ కేడర్‌ను వెన్నంటి నడిపించారు. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి కీలకమైన పదవిలో ఆమెకు అవకాశం ఉంటుందని జిల్లా నేతలు భావిస్తుండగా ఉమ్మడి జిల్లా పరిధిలో కీలకమైన ఎమ్మెల్సీ పదవికి ఆమె అభ్యర్థిత్వాన్ని పార్టీ ఖరారు చేసింది.
 
రెండు జిల్లాల పరిధిలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కావడం వల్ల ఉభయ జిల్లాల్లో పట్టు ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లా పరిధిలోని మంత్రి, స్పీకర్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే మాజీ ఎంపీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు పార్టీ నేతలు తెలిపారు. ఉమ్మడి జిల్లా పరిధిలో 80 శాతంకు పైగా టీఆర్‌ఎస్‌ ఓటర్లే ఉండడం వల్ల గెలుపు కూడా సునాయసంగా ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు