తుని కేసు : భూమనపై ప్రశ్నల వర్షం.. ముచ్చెమటలు పట్టించిన సీఐడీ.. నేడు అరెస్టు!?

బుధవారం, 7 సెప్టెంబరు 2016 (05:46 IST)
కాపు గర్జన సందర్భంగా తునిలో జరిగిన విధ్వంసం కేసులో తిరుపతి మాజీ ఎమ్మెల్యే, వైకాపా సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి వద్ద సీఐడీ అధికారులు ఒక రోజంతా విచారణ జరిపారు. గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఈ విచారణ జరిగింది. 
 
రాజమండ్రి ప్రాంతీయ సీఐడీ అదనపు ఎస్పీ టి.హరికృష్ణ, సీఐలు ఎస్‌.సూర్యభాస్కరరావు, ఎన్‌వీ నారాయణరావుల నేతృత్వంలోని సీఐడీ అధికారుల బృందం ఈ విచారణ జరిపింది. విచారణ మధ్యలో సీఐడీ అధికారులే భూమనకు భోజనం తెప్పించారు. ఓ దశలో భూమనను అరెస్టు చేస్తారని ఊహాగానాలు కూడా వినిపించాయి. దీంతో, సీఐడీ కార్యాలయం బయట తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కానీ, విచారణ పూర్తికాకపోవడంతో బుధవారం హాజరుకావాలని భూమనకు సూచించారు. 
 
ఈ సందర్భంగా భూమనపై సీఐడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా.. తుని ఘటనలో వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి హస్తముందా అంటూ పదేపదే గుచ్చిగుచ్చి అడిగారు. దీనికి ఆయన మాత్రం తనకు గానీ, వైకాపా నేతలకుగానీ ఎలాంటి సంబంధం లేదని చెప్పినట్టు సమాచారం. 
 
మరోవైపు.. విచారణ అనంతరం భూమన మీడియాతో మాట్లాడారు. సీఐడీ అధికారుల ప్రశ్నలు, తాను చెప్పిన సమాధానాలకు సంబంధించిన వివరాలను ఇప్పుడే వెల్లడించలేనన్నారు. బుధవారం కూడా విచారణ ఉందని, అది ముగిశాక అన్ని విషయాలూ వెల్లడిస్తానని చెప్పారు. బ్రిటిష్‌ నియంత రూథర్‌ఫర్డ్‌లా సీఎం చంద్రబాబు వ్యవహరిస్తూ తమను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని కరుణాకరరెడ్డి ఆరోపించారు.

వెబ్దునియా పై చదవండి