హైదరాబాద్‌లో కుంభవృష్టి : భారీ వర్షానికి కొట్టుకునిపోయిన వ్యక్తి

మంగళవారం, 1 అక్టోబరు 2019 (09:18 IST)
హైదరాబాద్ నగరంలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భాగ్యనగరి వాసులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రోడ్లు జలమయం అవుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు మునిగిపోతున్నాయి. 
 
ఇక, పొంగిపొర్లుతున్న నాలాలు రోడ్లను కాలువల్లా మార్చేస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షానికి యూసుఫ్‌గూడ, కృష్ణానగర్‌లో నడిరోడ్డుపై ఓ వ్యక్తి కొట్టుకుపోయిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
వరద నీటిలో కొట్టుకుపోతున్న తన ద్విచక్ర వాహనాన్ని పట్టుకునే క్రమంలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నీటిలో అతడు కొట్టుకుపోయాడు. ఆ వ్యక్తి ఎవరు? ఆ తర్వాత ఏం జరిగింది? అన్న విషయాలు తెలియరాలేదు. అందరూ చూస్తుండగానే అతడు నీటిలో కొట్టుకుపోయాడు. 
 
అలాగే, నీటి గుంతలో మునిగిపోతున్న బాలుడిని రక్షించే ప్రయత్నంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలం ఘనపూర్‌లో జరిగింది. రజిత, సునీతలు దసరా సెలవులకు గ్రామానికి రాగా వీరి కుటుంబాలు సోమవారం నర్సింహులగుట్టకు వనభోజనాలకు వెళ్లాయి. 
 
రజిత కుమారుడు ప్రశాంత్‌ (21), సునీత కూతురు పావని (17) జారుడుబండపై ఆడుకున్నారు. అక్కడున్న నీటిగుంతలో వినోద్‌కుమార్‌(7) పడిపోయాడు. ప్రశాంత్‌ గుంతలోకి దిగి బాలుడిని రక్షించాడు. ఈ క్రమంలో ప్రశాంత్‌ మునిగిపోతుండటంతో అతడిని రక్షించేందుకు పావని అందులోకి దిగగా నీట మునిగి ఇద్దరూ చనిపోయారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు