కాన్షీరాం ఆదర్శం : పవన్‌కు ఉండవల్లి సలహా

సోమవారం, 27 మే 2019 (18:44 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు మాజీ ఎంపీ, సీనియర్ రాజకీయ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ ఓ సలహా ఇచ్చారు. బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాం కూడా ఎదుర్కొన్న ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయారనీ, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారని గుర్తుచేశారు. అందువల్ల పవన్ కూడా ఇపుడు అధైర్యపడాల్సిన అవసరం లేదనీ, ముఖ్యంగా ఈ ఓటమితోనే నైరాశ్యం చెందాల్సిన అవసరం అంతకంటే లేదన్నారు. 
 
ఉండవల్లి సోమవారం విలేకరులతో మాట్లాడుతూ, ఎన్నికల్లో గెలుపోటములు సహజమేనని చెప్పారు. అందువల్ల పవన్ కళ్యాణ్ లేదా చంద్రబాబు నాయుడులు నిరాశ చెందాల్సిన అవసరం లేదన్నారు. అయితే, ఈ ఎన్నికల్లో పవన్ ఖచ్చితంగా గెలుస్తాడనీ అసెంబ్లీలో అడుగుపెడతాడని తాను భావించానని తెలిపారు. కానీ, దురదృష్టవశాత్తు ఆయన పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారని గుర్తుచేశారు. 
 
ఏదేమైనా కాన్షీరాం పేరు ఎక్కువగా చెబుతుంటారు కాబట్టి ఆయన్ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కాన్షీరాం కూడా మొట్టమొదట నిలబడినప్పుడు ఇదే పరిస్థితి వచ్చింది. కానీ వదిలిపెట్టకుండా కాన్షీరాం ముందుకు నడిచి ఈరోజు భారతదేశంలో ఒక ఉన్నతస్థాయిలో ఆయన పార్టీని నిలబెట్టగలిగారు. కాబట్టి, ఎవరు కూడా నిరాశ చెందాల్సిన పనిలేదు. ప్రజాస్వామ్యంలో ఇది చాలా సర్వసాధారణమైన విషయమని చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు