కరోనా రోగులకు ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్స్‌ను అందించిన కలెక్టర్ ఇంతియాజ్

బుధవారం, 2 జూన్ 2021 (16:04 IST)
కరోనా విపత్కర పరిస్థితులలో స్వచ్ఛంధ సంస్థలు తగిన సేవానిరతితో ముందుకు రావాలని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ పిలుపునిచ్చారు. వ్యక్తుల మొదలు కార్పొరేట్ సంస్థల వరకు అంతా తమకు తోచిన రీతిగా కరోనా బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. నగరంలోని తాడిగడపకు చెందిన కాజాస్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫోండేషన్ కరోనా రోగుల కోసం నూతనంగా సమకూర్చిన ఐదు ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్స్‌ను విజయవాడ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్ ఆవిష్కరించారు.
 
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కాజాస్ హెల్పింగ్ హ్యాండ్స్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు స్పూర్తిదాయకంగా ఉన్నాయన్నారు. పౌండేషన్ అందిస్తన్న సేవలను సద్వినియోగం చేసుకుని, ఎక్కువమందికి ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్స్ ఉపయోగపడేలా రోగులు సైతం సహకరించాలన్నారు.
 
కాజాస్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫోండేషన్ ఛైర్మన్ కాజా చక్రధర్ మాట్లాడుతూ, తాము సమకూర్చుకున్న ఐదు కాన్సన్‌ట్రేటర్స్‌ను రోగులకు ఏడు నుండి పది రోజుల కాలపరిమితితో పూర్తి ఉచితంగా అందిస్తామన్నారు. త్వరలోనే మరికొన్నింటిని సమకూర్చుకుని కరోనా పీడితులకు పెద్దఎత్తున సహకరించాలని భావిస్తున్నామన్నారు.
 
సంస్థ కోఛైర్మన్ కాజా రమణి మాట్లాడుతూ తమ సంస్థ తరుపున గత పది రోజులుగా నిత్యం వందమందికి ఉచితంగా ఆహారం ఆందిస్తున్నామని తెలిపారు. అవసరమైన వారికి ఇతర రూపాలలో సైతం సహాయం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా పాలనాధికారి చేతుల మీదుగా నూజివీడుకు చెందిన తిరుపతిరావు, వీరపనేని గూడెంకు చెందిన రాంబాబులకు ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్స్‌ను అందించారు. కార్యక్రమంలో పౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు