ప్రేమ పెళ్లి.. నగల తనాఖాలో చిచ్చు.. భార్యను కాల్చిన హోంగార్డు... ఎక్కడ?

గురువారం, 15 ఏప్రియల్ 2021 (07:56 IST)
వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం అన్యోన్యంగా కాపురం చేశారు. కానీ నగలను కుదువపెట్టే విషయంలో గొడవలు జరిగాయి. బ్యాంకు రుణం తీర్చేందుకు భార్య నగలను తాకట్టు పెట్టగా.. ఆభరణాల కోసం ఆమె గొడవ చేయడంతో కాల్చి చంపేశాడు. ఈ దారుణానికి పాల్పడింది ఓ హోంగార్డు. ఈ దారుణం విజయవాడ భవానీ పురంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తూర్పుగోదావరి జిల్లా అన్నవరానికి చెందిన పాలచర్ల వినోద్‌ కుమార్‌, విశాఖపట్నానికి చెందిన ఎర్రా సూర్యరత్నప్రభను 2019లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వినోద్‌కుమార్‌ ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌లో హోంగార్డుగా ఎంపికయ్యాడు.
 
ప్రస్తుతం అక్కడ అదనపు ఎస్పీ శశిభూషణ్‌కు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వినోద్‌ తన వ్యక్తిగత రుణం తీర్చేందుకు భార్య నగలను రూ.2 లక్షల 44 వేలకు తాకట్టు పెట్టాడు. ఈ ఆభరణాలను విడిపించే విషయంలో భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. 
 
ఆదివారం రాత్రి మళ్లీ  గొడవ జరిగింది. త్వరలో తన కజిన్‌ పెళ్లి ఉందని, ఆభరణాలు విడిపించమని సూర్యరత్నప్రభ భర్తను గట్టిగా అడిగింది. దీంతో ఆవేశంలో తన వద్ద ఉన్న పిస్టల్‌తో వినోద్‌కుమార్‌ భార్యను కాల్చేశాడు. రక్తపుమడుగులో పడి ఉన్న ఆమెను చుట్టుపక్కలవారు రెండు ప్రైవేటు ఆస్పత్రులకు తీసుకెళ్లినా చేర్చుకోలేదు. 
 
తర్వాత ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లినా.. అప్పటికే ఆలస్యం కావడంతో సూర్యరత్నప్రభ చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసు విచారణలో తొలుత మిస్‌ఫైర్‌ అయిందని చెప్పిన వినోద్‌కుమార్‌.. చివరకు లోతైన విచారణలో జరిగిన విషయమంతా చెప్పాడు.
 
వినోద్‌కుమార్‌.. మూడు రోజుల క్రితం తన బాస్‌తో కలిసి అనంతపురం వెళ్లి.. ఆదివారం రాత్రి తిరిగి విజయవాడ వచ్చారు. శశిభూషణ్‌ను కుంచనపల్లిలోని అపార్ట్‌మెంట్‌ వద్ద దింపేసి... భవానీపురంలోని ఇంటికి చేరుకున్నాడు. ఇంటికెళ్లాక తన పిస్టల్‌ లేకపోవడాన్ని గమనించిన శశిభూషణ్‌ వెంటనే వినోద్‌కుమార్‌కు ఫోన్‌ చేశారు. 
 
పిస్టల్‌ తన బ్యాగ్‌లోనే ఉందని, ఉదయమే అప్పగిస్తానని హోంగార్డు చెప్పాడు. అయితే దాన్ని తక్షణమే ఇంటికి తీసుకురావాలని శశిభూషణ్‌ ఆదేశించలేదు. వినోద్‌కుమార్‌‌పై అతివిశ్వాసమే పరోక్షంగా ఒకరి హత్యకు కారణమయ్యిందని అంటున్నారు. శశిభూషణ్‌ మరికొద్ది నెలల్లో ఉద్యోగ విరమణ చేయబోతున్నారు. ఆయనపై ప్రభుత్వం వేటు వేస్తుందా లేక మోమో ఇచ్చి వివరణ కోరుతుందా? అన్నది వేచి చూడాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు