పవన్ కళ్యాణ్‌పై పలు సెక్షన్ల కేసు నమోదు

గురువారం, 13 జులై 2023 (10:29 IST)
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై కేసు నమోదైంది. వాలంటీరు సురేష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజయవాడలోని కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేశారు. ఏలూరులో నిర్వహించిన వారాహి యాత్రలో వాలంటీర్లపై పవన్‌ చేసిన వ్యాఖ్యలపై సురేష్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సెక్షన్‌ 153, 153ఏ, 505(2) ఐపీసీ సెక్షన్ల కింద పవన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
మహిళల అక్రమ రవాణాపై ఆధారాలు ఇవ్వాలి : తానేటి వనిత 
 
వలంటీర్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలను ఏపీ హోం మంత్రి తానేటి వనిత ఖండించారు. జనసేనాని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమెన్ ట్రాఫికింగ్‌పై పవన్ వద్ద ఆధారాలు ఉంటే... కేంద్ర నిఘా సమాచారం ఉంటే బహిర్గతం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. కరోనా కష్టకాలంలో వాలంటీర్లు ఎనలేని సేవలు చేశారన్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా పని చేశారని కితాబునిచ్చారు. 
 
ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణు మాట్లాడుతూ, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రెండు జిల్లాలకే పరిమితం చేశారని విమర్శలు గుప్పించారు. వాలంటీర్లపై పవన్ నీచ ఆరోపణలు చేశారని ధ్వజమెత్తారు. పవన్‌ను ట్రాప్ చేసి చంద్రబాబు వాలంటీర్లపై అలా మాట్లాడించారన్నారు. గత ఎన్నికల్లో జనసేన ఒక్క సీటూ గెలవలేదని, రాపాక వరప్రసాద్‌కు మంచి పేరు ఉండటం వల్లే గెలిచాడన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు