ఆరోగ్యశ్రీ పరిధిలోకి విష జ్వరాలు.. ఏపీ సర్కారు కీలక నిర్ణయం

బుధవారం, 8 సెప్టెంబరు 2021 (16:51 IST)
వైద్యానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా పేద ప్రజలకు ఉపశమనం కలిగించే వార్త చెప్పింది. విష జ్వరాలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చింది. ఈ విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. ఈ మేరకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో నమోదవుతున్న డెంగ్యు, చికున్ గున్యా, మలేరియా కేసులు పెరగకుండా చర్యలు చేపట్టినట్లు మంత్రి వెల్లండించారు. 
 
అందులో భాగంగానే ప్రజలు చికిత్స పరంగా ఇబ్బంది పడకుండా వాటిని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చినట్లు చెప్పారు. ప్రస్తుతం విశాఖ జిల్లాలో 462 డెంగ్యూ, 31 చికెన్ గున్యా, 708 మలేరియా కేసులు నమోదయ్యాయని మంత్రి తెలిపారు. ఈ సంఖ్య ఇంకా పెరగకుండా, ప్రజలు చికిత్స పరంగా ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారని మంత్రి నాని అన్నారు. 
 
ఇప్పటికే జిల్లాలో విషజ్వరాలు ఎక్కువగా నమోదవుతున్నందున దగ్గర అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తం అయిందన్నారు. ఎక్కువ కేసులు ఉన్నచోట స్పెషల్ శానిటేషన్ డ్రైవ్, మెడికల్ క్యాంపులు నిర్వహించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
 
 విష జ్వరాలను గుర్తించడానికి రెగ్యులర్‌గా సర్వే జరుగుతుందన్నారు. టెస్ట్స్ ఎక్విప్ మెంట్, మందులు సిద్దంగా ఉంచాలని అధికారులకు చెప్పామన్నారు. మిగతా జిల్లాల కంటే విశాఖపట్నం జిల్లా లో విషజ్వరాలు కాస్త ఎక్కువగా ఉన్నాయని మంత్రి ఆళ్ల నాని చెప్పారు.
 
సీజనల్ వ్యాధులపై ఇటీవలే మంత్రి ఆళ్ల నాని అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రోజు రోజుకూ పెరుగుతున్నసీజనల్ వ్యాధుల పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది అన్నారు. ఎక్కడైతే డెంగ్యూ, మలేరియా వ్యాధులు ఎక్కువ వస్తున్నాయో.. అక్కడ ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ప్రత్యేకంగా శానిటేషన్ డ్రైవ్ నిర్వహించాలని.. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించవద్దని స్పష్టం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు