వివేకా హత్య కేసు: లేఖలోని సారాంశాన్ని వెల్లడించిన సునీత భర్త!

ఆదివారం, 23 జులై 2023 (11:04 IST)
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల, వివేకా కూతురు సునీతా రెడ్డిలు సీబీఐకు ఇచ్చిన వాంగ్మూలాలు ఇప్పటికే సంచలనంగా మారాయి. తాజాగా ఇదే కేసులో వివేకా కుమార్తె డాక్టర్ సునీతా రెడ్డి భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డి వాంగ్మూలం వెలుగు చూసింది. వైఎస్ఆర్ తండ్రి రాజారెడ్డి హత్య తర్వాత జరిగిన హింసను దృష్టిలో పెట్టుకొని వివేకా హత్యాస్థలిలో దొరికిన లేఖను తాను వచ్చే వరకు దాచి పెట్టాలని కోరినట్టు రాజశేఖర రెడ్డి సీబీఐకి తెలిపారు. 
 
ఆ రోజు ఉదయం 6.30 గంటలకు వివేకా పీఏ కృష్ణారెడ్డి ఫోన్ చేసి ఘటన స్థలంలో లేఖ ఉన్నట్లు చెప్పారని, ఆ లేఖలో ఏముందని అడగగా.. డ్రైవర్ ప్రసాద్ బాధ్యుడు అని ఉందని చెప్పినట్లుగా వెల్లడించారు. ప్రసాద్‌కు ప్రాణహానిని దృష్టిలో పెట్టుకొని తాను వచ్చి వ్యక్తిగతంగా పోలీసులకు లేఖను ఇస్తానని చెప్పానని వాంగ్మూలంలో తెలిపారు. 
 
వివేకా పేరు మీద ఉన్న ఆస్తుల గురించి సీబీఐ ప్రశ్నించగా తనకు కొన్ని తెలుసునని రాజశేఖరరెడ్డి సమాధానం చెప్పారు. హత్య జరగడానికి ముందు రోజు కడప ఎంపీగా తాను పోటీ చేయనున్నట్లు జమ్మలమడుగులో వివేకా చెప్పారని సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు. హత్యకు ముందు రోజు మార్చి 14న శివశంకర్ రెడ్డి గూగుల్ టేకవుట్ లొకేషన్ ను సీబీఐ చూపించగా వివేకా ఇంటిదేనని గుర్తించారు. సాధారణంగా శివశంకర్ రెడ్డి తమ ఇంట్లోకి రాడని చెప్పారు.
 
ఆ రోజు పీఏ కృష్ణారెడ్డి ఫోన్ చేసి వివేకానంద రెడ్డి పులివెందులకు ఎప్పుడు వస్తున్నారని ఆరా తీశారని, తాము కడపలో ఉన్నామని చెప్పినట్లు రాజశేఖర రెడ్డి తెలిపారు. రాజశేఖర రెడ్డిని సాక్షిగా పేర్కొంటూ ఆయన వాంగ్మూలాన్ని గత నెల 30న అనుబంధ ఛార్జీషీట్‌తో పాటు సీబీఐ కోర్టుకు సమర్పించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు