పరాయి వ్యక్తి మోజులోపడి పట్టించుకోవడం లేదనీ.. లేడీ కానిస్టేబుల్‌ను హత్య చేసిన భర్త...

సోమవారం, 9 నవంబరు 2020 (22:07 IST)
ఇటీవలి కాలంలో వివాహేతర హత్యలు ఎక్కువైపోతున్నాయి. భర్త లేదా భార్య వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం, అది బహిర్గతం కావడంతో దారుణ చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ భర్త.. పరాయి పురుషుడి మోజులోపడి తనను, పిల్లలను పట్టించుకోవడం లేదని భావించి పోలీస్ కానిస్టేబుల్‌గా ఉన్న భార్యను దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత ఈ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించి, అందర్నీ నమ్మించేందుకు శతవిధాలా ప్రయత్నించాడు. అయితే, పోలీసుల విచారణలో భర్తే హంతకుడని తేలింది.
 
ఈ ఘటన విశాఖపట్టణం నక్కపల్లి పోలీస్ భవన సముదాయ ప్రాంగణంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నక్కపల్లి పోలీస్ క్వార్టర్స్‌లో నాగళ్ల భవానీ అనే మహిళా కానిస్టేబుల్ విగతజీవిగా కనిపించడం సంచలనం సృష్టించింది. మృతదేహం ఫ్యాన్‌కు వేలాడుతుండడంతో ఆత్మహత్య చేసుకుందని భావించారు. 
 
ఆమె భర్త సింహాద్రి కూడా ఆత్మహత్య అనే చెప్పాడు. వివాహేతర సంబంధం బట్టబయలవడంతో అవమానంతో ఉరేసుకుని చనిపోయిందని అందరినీ నమ్మించే యత్నం చేశాడు. అయితే, పోలీసుల దర్యాప్తులో ఆమెది ఆత్మహత్య కాదు, హత్య అని స్పష్టమైంది. ఆమె భర్త సింహాద్రి ఈ హత్య చేసినట్టు గుర్తించారు. 
 
భవానీ తలపై గట్టిగా మోది, ఆపై ఫ్యాన్‌కు ఉరేసినట్టు వెల్లడైంది. వివాహేతర సంబంధం మోజులో తనను, పిల్లలను భవానీ పట్టించుకోవడం లేదని అనుమానం పెంచుకున్న సింహాద్రి ఆమెను చంపి, ఆత్మహత్యగా చిత్రీకరించాడని దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం సింహాద్రి పోలీసుల అదుపులో ఉన్నాడు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు