మున్సిపల్ ఎన్నికల్లోనూ ఓటింగ్ శాతం పెరగాలి: కృష్ణా కలెక్టర్‌

గురువారం, 25 ఫిబ్రవరి 2021 (08:25 IST)
గ్రామ పంచాయతి ఎన్నికలు విజయవంతంగా నిర్వహించిన తీరులోనే మున్సిపల్ ఎన్నికల నిర్వాహణకు అధికారులు సిద్ధం కావాలని కృష్ణాజిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఏ.యండి. ఇంతియాజ్ ఆదేశించారు. విజ‌య‌వాడ‌లోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జిల్లా ఎన్నికల అథారిటీ ఆధ్వర్యంలో ఆర్ఓలు, ఏఆర్‌ఓలు, ఇఓలు, ఏఇఓలు, జోనల్ అధికారులకు శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశారు.

సమావేశంలో మున్సిపల్ కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్, జాయింట్ కలెక్టర్‌ (ఆసరా) మోహన్‌కుమార్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ఇంతియాజ్ మాట్లాడుతూ సాధారణంగా పట్టణ ప్రాంతంలో ఓటర్ల నిర్లిప్తత కారణంగా ఓటింగ్ శాతం తక్కువుగా ఉంటుందని చెప్పారు. ఓటింగ్ శాతం పెంచేందుకు అధికార యంత్రాంగం ప్రత్యేకంగా కృషి చేయాలని కోరారు.

ఎన్నికలు జరగడానికి కనీసం 3 రోజులు ముందే ఓటర్ స్లిప్లు ఓటర్లకు చేరేలా చూడాలన్నారు. దూరప్రాంతాల్లో ఉన్న ఓటర్లు కూడా ఓటరు స్లిప్పులు వచ్చాయని ఓటువేసే అవకాశం ఉంటుంద‌ని ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లాలోని గ్రామపంచాయతి ఎన్నికల్లో దాదాపు 85 శాతం ఓటింగ్ నమోదైందని, ఎక్కడా చిన్న గొడవలు లేకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరిపారన్నారు.

అదే తరహాలో మున్సిపల్ ఎన్నికల్లో కూడా కనీసం 80 శాతం ఓటింగ్ నమోదు కావాలని, ఆ మేరకు ప్రయత్నాలు చేయుమని అధికారులను కోరారు. సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా పెట్టాల‌ని అధికారులను ఆదేశించారు.

న‌గ‌ర మున్సిపల్ కమిషనర్‌ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ ఎన్నికల నియమావళిపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. సొంత నిర్ణయాలు తీసుకోరాదని, ఏదైనా సందేహాలు ఉంటే ఉన్న‌తాధికారులను సంప్రదించాలన్నారు. ఈ ఎన్నికల్లో ఈవీయంలు ఉపయోగించడం లేదని, బ్యాలెట్ పద్ధతిలోనే పోలింగ్ ప్రక్రియ జరుగుతుందన్నారు.

అందువల్ల పోలింగ్ ముందు రోజే ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. జాయింట్ కలెక్టర్‌(సంక్షేమం) కె.మోహనరావు మాట్లాడుతూ స్టేజ్-1 ఎన్నికల అధికారులు శిక్షణా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. నామినేషన్ ప్రక్రియ నుండి బ్యాలెట్ పేపర్ల పంపిణీ వరకూ, అభ్యర్ధులకు గుర్తులు కేటాయింపు, ఓటింగ్ నిర్వహించే రోజున, అంతకుముందు చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికలను వివరించడం జరిగింది.

మున్సిపల్ కార్పోరేషన్ చట్టం, మున్సిపల్ పట్టణాల చట్టాలను, ఆర్ఓ, ఏఆర్‌ఓలు ఎన్నికల్లో చేపట్టాల్సిన విధులపై శిక్షణా తరగతుల్లో విశదీకరించారు. కార్య‌క్ర‌మంలో అర్బన్ డెవలప్‌మెంట్ అధికారి అరుణ, జిల్లాలోని ఎన్నికలు జరుగుతున్న మచిలీపట్నం కార్పోరేషన్, నందిగామ, పెడన, మిగిలిన అన్ని మున్సిపాల్టీల కమిషనర్లు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు