4 సంవత్సరాలలో కడప రూపురేఖలు మారుస్తాం: ఉప ముఖ్యమంత్రి అంజాద్బాష

శుక్రవారం, 18 సెప్టెంబరు 2020 (15:45 IST)
రాబోయే నాలుగు సంవత్సరాలలో కడప పట్టణంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి నగర రూపురేఖలు మార్చడం జరుగుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ బి. అంజాద్బాష పేర్కొన్నారు.
 
 ఉప ముఖ్యమంత్రి గౌస్ నగర్, గంజికుంటకాలనీలలో నీరు నిలిచిన ప్రాంతాలను సందర్శించారు.
 ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ... గత మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల నగరంలోని కొన్ని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయన్నారు.

నగరంలో కొంతమంది పెద్ద పెద్ద డ్రై న్ లను ఆక్రమించి ఇల్లు నిర్మించుకోవడంవల్ల వర్షపు నీరంతా బయటికి వెళ్లకుండా రోడ్లపైకి వస్తుందన్నారు. కావున కొత్తగా ఇంటి నిర్మాణాలు చేపట్టే వారు తప్పకుండా నగరపాలక సంస్థ వారి ప్లాన్ ప్రకారం ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలన్నారు. ప్లాన్ లేకుండా ఇళ్ల నిర్మాణాలు చేపడితే అవి తొలగించడం జరుగుతుందన్నారు.

కడప పట్టణంలోని నివాస ప్రాంతాలలో  ఖాళీ స్థలాలు ఎక్కువగా ఉన్నాయని ఖాళీ స్థలాల  యజమానులు తమ స్థలంలో ఎత్తి పెంచుకుని నీరు నిల్వ ఉండకుండా శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. నివాస ప్రాంతాలలో ఉన్న ఖాళీ స్థలాలలో ఎత్తు పెంచకపోతే వారికి నోటీసులు అందజేసి జరిమానా విధించాలని మున్సిపల్ అధికారులకు సూచించడం జరిగిందన్నారు.

ఈ ప్రక్రియ కేవలం వారం పది రోజుల్లో పూర్తి చేయాలన్నారు. పట్టణంలో కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు స్థలాలు కొనుగోలు చేసి ఏళ్ళతరబడి అక్కడ నిర్మాణాలు చేపట్టకుండా మంచి ధరల కోసం వాటిని ఖాళీగా వదిలేయడం జరిగిందన్నారు. ఈ కాళీ స్థలాలు చాలా తగ్గు ఉండటం వల్ల నీరంతా చేరిందన్నారు.

నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు వృద్ధి చెందే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. ఇది పేదలు నివసించే  ప్రాంతమని ఇక్కడ దోమలవల్ల ప్రజలు అనారోగ్యానికి గురైతే వారు కోలుకునే పరిస్థితి లేదన్నారు. కావున నగరపంచాయతీలో ని ఆమెనిటేస్ ప్లానింగ్ సెక్రటరీలు వాళ్ల ప్రాంతాలలో ఉండే ఖాళీ స్థలాలను గుర్తించి ఖాళీ స్థలాలను ఎత్తు పెంచుకునే విధంగా ఓనర్ లకు రెండు మూడు రోజులలో నోటీసులు పంపాలన్నారు.

నగరంలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రభుత్వానికి 380 కోట్ల రూపాయలతో ప్రపోజల్ పంపడం జరిగిందన్నారు. దీంతో ముఖ్యమంత్రివర్యులు స్పందించి కడప నగరానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించి కడప నగరాన్ని రాబోయే నాలుగు సంవత్సరాలలో మరింత అభివృద్ధి చేయడం జరుగుతుందని హామీ ఇవ్వడం జరిగిందన్నారు.

అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా సిసి రోడ్లు, సిసి డ్రై న్ లకు 150 కోట్ల రూపాయలు ప్రపోజల్ పంపామన్నారు.14వ ఫైనాన్స్ నిధులు 50 కోట్ల రూపాయలతో నగరంలోని అన్ని డివిజన్లు అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. కరోనా మహమ్మారి వల్ల అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణలో కొంత జాప్యం జరిగిందని ఇక వెంటనే కాంట్రాక్టర్లను పిలిపించి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించాలని అధికారులకు సూచించడం జరిగిందన్నారు.

27వ డివిజన్ గౌస్ నగర్ లో కోటి 48 లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు టెండర్లు పూర్తయ్యాయన్నారు. త్వరలో ఈ పనులు కూడా ప్రారంభిస్తామన్నారు.57 లక్షల రూపాయలతో కేసీ కెనాల్ ఇరువైపులా రోడ్డు నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ పనులు కూడా వారం పది రోజుల్లో ప్రారంభిస్తామన్నారు. 

ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం నా బాధ్యతగా కడప నగరాన్ని ఒక సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి కడప నగరాన్ని మురికి రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు అప్పట్లో  74 కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ప్రారంభించడం జరిగిందన్నారు.

కడప నగరాన్ని నాలుగు జోన్లుగా విభజించడం జరిగిందని, 74 కోట్ల రూపాయలతో మొదట 3,4 జోన్లలో డ్రైనేజీ పనులు చేపట్టడం జరిగిందన్నారు. 3, 4 జోన్లలో 90శాతం మాత్రమే పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు. మిగిలిన బ్యాలెన్స్ పనులకు సంబంధించి 128  కోట్ల రూపాయలు నిధులు మంజూరయ్యాయని  ఈ పనులు కూడా త్వరలో పూర్తి చేయడం జరుగుతుందన్నారు.

1,2 జోన్ లకు సంబంధించి అవసరమైన నిధులకు  డీపీఆర్ తయారు చేయాలని అధికారులకు సూచించడం  జరిగిందన్నారు.1, 2 జోన్ లకు సంబంధించి సుమారు 400 కోట్ల రూపాయలు నిధులు అవసరమవుతాయని డిపిఆర్ లో గుర్తించడం జరిగిందన్నారు. ఈ విషయం ముఖ్యమంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించి నగరంలో పూర్తిస్థాయి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి చేయడం జరుగుతుందన్నారు.

అమృత్ పథకం కింద పట్టణంలో ప్రజలకు 24 గంటలు నీటి సరఫరా చేసేందుకు 12 జి ఎల్ ఎస్ ఆర్ లు నిర్మించి 24 గంటలు నీటి సరఫరా చేయడం జరుగుతుందన్నారు. నగరంలో బ్రిటిష్ కాలంలో వేసిన వాటర్ పైపులు ఉన్నాయని ఇవి మరమ్మతులకు గురికావడంతో వీటిని తొలగించి కొత్త పైపులు వేయడం జరుగుతుందన్నారు.

కడప నగరాన్ని ఒక పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దడం జరుగుతుందన్నారు. ఈ ప్రాంతంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన తిరుమల తొలి గడప దేవుని కడప ఉందన్నారు. మరియు అమీన్ పీర్ దర్గా, క్యాథలిక్ చర్చి ఉన్నాయన్నారు. కడప నగరం మత సామరస్యానికి ప్రతీక అని ఇక్కడ హిందువులు ముస్లింలు క్రైస్తవులు సోదర భావంతో కలిసిమెలసి ఉంటారన్నారు.

ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా కూడా అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. పాత కడప చెరువును 55 కోట్ల రూపాయలతో  హైదరాబాద్ ట్యాంక్ బండ్ తరహాలో అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. పాత కడప చెరువు నందు ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటు చేసి, పర్యాటకుల సందర్శన కొరకు బోటింగ్ ఏర్పాటు, ఈ ప్రాంతాన్ని మంచి ఆహ్లాదకర వాతావరణంతో అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు.

15 కోట్ల రూపాయలతో బుగ్గవంక రోడ్డు కిరువైపులా సర్వీస్ రోడ్లు వేయడం జరుగుతుందన్నారు. వచ్చే ఆదివారం సర్వీస్ రోడ్డుకు శంకుస్థాపన చేయడం జరుగుతుందన్నారు. రాబోయే నాలుగు సంవత్సరాలలో కడప నగరంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి నగర రూపురేఖలు మార్చడం జరుగుతుందని ఇందుకు ప్రజల సహాయ సహకారాలు అందించాలన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ లవన్న, ఎం హెచ్ వో శ్రీనివాస్ రెడ్డి, నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు, 31వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి అజ్మతుల్లా, తదితరులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు