ఉద్యోగం పేరిట వాడేసుకున్నారు.. ఆ వీడియో సీఎం జగన్ వరకు వెళ్ళాలి..?

శనివారం, 12 జూన్ 2021 (21:09 IST)
ఏపీలో మరో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. మహిళలను లొంగదీసుకుని వాడేసుకుంటున్న కామాంధులు పెరిగిపోతున్నారనేందుకు తాజా ఘటనే నిదర్శనం. నెల్లూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ లైంగిక వేధింపుల ఘటన మరువక ముందే.. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి యువతిని నేరుగా కమిట్‌మెంట్ అడిగిన ఉన్నతాధికారి బాగోతం బయటపడింది.
 
ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఉన్నతాధికారి లొంగదీసుకుని మోసం చేశాడంటూ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన యువతి విడుదల చేసిన సెల్ఫీ వీడియో సంచలనంగా మారింది. శారీరక వాంఛలు తీర్చుకుని ఉద్యోగం ఇవ్వలేదని.. వెళ్లిన ప్రతిసారీ మళ్లీ కోరిక తీర్చాలని వేధింపులకు గురిచేస్తున్నారని ఆమె సంచలన ఆరోపణలు చేసింది.
 
వివరాల్లోకి వెళితే.. ఇద్దరు మధ్యవర్తులు ఉద్యోగం ఇప్పిస్తామని కేఆర్ పురం ఐటీడీఏ ఉన్నతాధికారి వద్దకు తీసుకెళ్లారని యువతి తెలిపింది. ఆయన తణుకులో వార్డెన్ ఉద్యోగం ఇప్పిస్తానని.. తనను కమిట్‌మెంట్ అడిగాడని చెప్పింది. ఉద్యోగం కోసం ఆశతో.. గత్యంతరం లేక ఆయనకు లొంగిపోయానని.. పలుమార్లు ఆయన తనతో తీసుకెళ్లారని ఆరోపించింది.
 
ఆ తర్వాత ఉద్యోగం కోసం అడిగినా పట్టించుకోవడం లేదని ఆమె వాపోయింది. వెళ్లిన ప్రతిసారీ వేధింపులేనని వాపోయింది. ఉద్యోగం రాకపోగా.. లొంగిపోయి మోసపోయానని.. తనలా మరో అమ్మాయికి జరగకూడదనే ఉద్దేశంతోనే బయటపెడుతున్నానని ఆమె ఆవేదన చెందింది. ఈ వీడియో సీఎం జగన్ వరకూ వెళ్లాలని.. తనకు న్యాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు