ప‌వ‌న్ కళ్యాణ్‌కి జిందాబాద్ కొడుతున్న ఎమ్మెల్యే బొండా ఉమ‌... కొత్త కర్చీఫ్‌ రెడీనా?

శనివారం, 3 సెప్టెంబరు 2016 (14:14 IST)
విజ‌య‌వాడ ‌: జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పుట్టిన రోజు సంబ‌రాలు... వ‌చ్చే రాజ‌కీయ ప‌రిణామాల‌కు అద్దంప‌ట్టాయి. విజ‌య‌వాడ‌లో ప‌వ‌న్ జ‌న్మ‌దిన వేడుకల‌కు కుర్ర‌కారు, ప‌వ‌న్ ఫ్యాన్స్ ఘ‌నంగా నిర్వ‌హించారు. అయితే, ఆ వేడుక‌ల వెనుక‌... కొంద‌రు ప్ర‌జాప్ర‌తినిధులు, రాజ‌కీయ నేత‌లున్నారు. ఇందులో ఎమ్మెల్యే బోండా ఉమ తీరుపై టీడీపీలో చర్చ మొదలైంది. పవన్‌ పుట్టిన రోజు సందర్భంగా విజయవాడలో బోండా ఉమా వర్గం భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. 
 
ఇందులో ప‌వ‌న్, ఉమ ఫోటోలు మాత్ర‌మే ఉండ‌టం హాట్‌ టాపిక్ అయింది. పైగా ఈ ఫ్లెక్సీల‌పై ప‌వ‌న్ పార్టీ జ‌న‌సేన సింబ‌ల్ కూడా ఉంది. వచ్చే ఎన్నికల బ‌రిలోకి ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌సేన దిగితే... అప్పుడు టిక్కెట్‌కి ప‌నికివ‌స్తుంద‌ని ముందే క‌ర్చీఫ్ వేశారా అనే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. తన సామాజిక వర్గానికే చెందిన పవన్ కళ్యాణ్ పైన బోండా ఉమా ఆశలు పెట్టుకున్నారా? అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫ్లెక్సీల విషయంలోనే కాదు.. ఇటీవల తిరుపతి సభలో పవన్‌ కల్యాణ్‌ తమను దూషించడంపై టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్‌ తీవ్రంగా స్పందించారు. పవన్‌పై తీవ్ర పదజాలంతో విమర్శలు చేశారు. 
 
టీడీపీ ఎంపీలను పవన్ తిట్టినప్పుడు మౌనంగా ఉన్న బోండా ఉమా… అదే ఎంపీలు పవన్‌కు కౌంటర్ ఇవ్వగానే, తీవ్రస్థాయిలో ఎదురుదాడికి దిగారు. పవన్‌ను విమర్శిస్తే మంచిగా ఉండదని టీజీ వెంకటేష్‌ను ఉమా హెచ్చరించారు. టీజీ వెంకటేష్‌ కాంగ్రెస్‌ సంస్కృతిని టీడీపీలో చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. దీనితో టీడీపీ నేత‌ల ముఖాల్లో రంగులు మారిపోతున్నాయి. పవన్‌ విషయంలో బోండా ఉమా సాఫ్ట్ కార్న‌ర్ చూస్తుంటే... ఈయ‌న ముందే క‌ర్చీఫ్ రెడీ చేసుకుంటున్నార‌ని గుస‌గుస‌లాడుతున్నారు. మొత్తమ్మీద జనసేన ఎన్నికలకు సై అంటే ముందువరసలో బొండా ఉమ ఉంటారని అనుకోవచ్చన్నమాట.

వెబ్దునియా పై చదవండి