చంద్రబాబు ఎందుకు మాట్లాడడు?: అంబటి రాంబాబు

సోమవారం, 17 ఫిబ్రవరి 2020 (07:47 IST)
ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరావును సస్పెండ్ చేసినప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడిన చంద్రబాబు,  మాజీ పీఎస్ పై ఐటీ దాడుల విషయంలో తనపై వస్తున్న ఆరోపణలను ఖండించేందుకు బాబు ఎందుకు మాట్లాడటం లేదని వైసీపీ ఎమ్మెల్యే అంబటి  రాంబాబు ప్రశ్నించారు.

మీడియాతో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు మౌనానికి అర్థమేంటి? మీ అబ్బాయి ఎందుకు మాట్లాడడు? అని ప్రశ్నించారు. తేలు కుట్టిన దొంగల్లా వీళ్లిద్దరూ ఉన్నారని, ఆ విషయం తెలియని టీడీపీ నేతలు అరుస్తున్నారని విమర్శించారు.

ప్రతి ఏటా స్వచ్ఛందంగా తన ఆస్తులను ప్రకటిస్తున్న చంద్రబాబుపై ఇలాంటి ఆరోపణలు చేయొద్దని టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై అంబటి స్పందిస్తూ, చంద్రబాబుకు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయంటూ ఆయనపై విచారణ జరపాలని లక్ష్మీపార్వతి  2005లో కోర్టును ఆశ్రయించిన విషయాన్ని ప్రస్తావించారు.

చంద్రబాబు నిజాయతీపరుడైతే ‘స్టే’ ఎందుకు తెచ్చుకున్నారు? విచారణ జరిపించుకోవాలిగా?  ఈ కేసులో విచారణకు భయపడుతున్న చంద్రబాబు నీతిమంతుడా? అని ప్రశ్నించారు.

తన వ్యక్తిగత పీఎస్ పై ఐటీ దాడులకు సంబంధించి చంద్రబాబు సమాధానం చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారని విమర్శించారు. చంద్రబాబు తప్పనిసరిగా విచారణ ఎదుర్కోవలసిందేనని, శిక్ష పడే పరిస్థితులు ఉన్నాయని జోస్యం చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు