కేరళ నుంచి తిరుపతికి నిఫా వైరస్.. గబ్బిలాలు కారణం కాదట..

ఆదివారం, 3 జూన్ 2018 (12:27 IST)
కేరళ నుంచి నిఫా వైరస్ తిరుపతికి పాకింది. ఇటీవల కేరళలో వైద్యురాలిగా పనిచేసి తిరుపతికి వచ్చిన మహిళకు నిఫా వైరస్ లక్షణాలున్నట్టు గుర్తించడంతో ఆమెను తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. సదరు వైద్యురాలికి చికిత్స అందిస్తున్నారు. అత్యంత ప్రాణాంతకమైన నిఫా వైరస్‌ భారత్‌లో తొలిసారిగా కేరళలో బయటపడింది. 
 
ఇప్పటివరకు నిఫా బారిన పడిన పది మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తిరుపతిలో నిఫా లక్షణాలు ఉండటంతో ఆప్రాంత ప్రజలు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్తున్నారు. ఇంకా తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ వైరస్ వ్యాపించదని వైద్యులు చెప్తున్నారు. ఇదిలావుంటే నిఫా దరిచేరకుండా ఇంటిపరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పండ్లను శుభ్రంగా కడిగి తీసుకోవాలని.. గబ్బిలాలు, పందులు, మృతిచెందిన పశువుల కళేబరాలకు దూరంగా వుండాలని వైద్యులు సూచిస్తున్నారు. 
 
అయితే ప్రాణాంతక నిఫా వైరస్ కేవలం కేరళనే కాదు యావత్‌ భారత్‌నూ భయాందోళనకు గురిచేస్తున్నప్పటికీ.. నిఫా వైరస్‌ విజృంభించడానికి సరైన కారణాన్ని నిర్ధరించలేకపోతున్నారు వైద్యులు. నిఫా వైరస్‌ బయటపడిన వెంటనే దానికి పండ్లపై వాలే గబ్బిలాలు కారణమనే వార్తలు వినిపించాయి. దీనిపై కేరళ చర్యలు కూడా తీసుకుంది.
 
ఈ మేరకు గబ్బిలాలు కొరికిన పండ్ల నమూనాలను కేరళ సర్కారు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హై సెక్యూరిటీ యానిమల్‌ డిసీజ్‌(ఎన్‌ఐహెచ్‌ఎస్‌ఏడీ)కు పంపారు. ఈ నమూనాలన్నింటినీ పరీక్షించిన ఈ సంస్థ వీటిలో నిఫాను కలిగించే లక్షణాలు లేవని తేల్చింది. దీంతోపాటు ఎలుకల నమూనాలను కూడా పరీక్షించారు. ఇందులోనూ నిఫావైరస్‌ను వ్యాప్తి చేసే లక్షణాలు లేవని తెలిసింది. 
 
అంతేకాకుండా పందులు, మేకలు, గేదెలు వంటి పశువుల నమూనాల్లోనూ నెగటివ్‌ అనే వచ్చింది. దీనిపై కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ మాట్లాడుతూ.. నిఫా వైరస్ వ్యాప్తికి గల కారణాన్ని అన్వేషించేందుకు మరో ప్రయత్నం మొదలెట్టామని చెప్పారు. ఇందుకు కారణం తెలియవస్తుందని.. అలా జరిగితే నిపా వైరస్ నివారణకు తగిన చర్యలు తీసుకుంటామని వైద్యులు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు