దుబాయ్ నుంచి వచ్చాడు.. రంజాన్ షాపింగ్ పేరుతో బయటకు తీసుకెళ్లి...

మంగళవారం, 22 మే 2018 (09:51 IST)
దుబాయ్ నుంచి వచ్చిన కట్టుకున్న భర్త.. రంజాన్ షాపింగ్ పేరుతో భార్యను తీసుకెళ్లి చంపేసి.. గోనె బస్తాలో కట్టి మురికి కాలువలో పడేశాడు. ఈ దారుణం హైదరాబాద్ నగరంలో వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్, నారాయణగూడ కింగ్‌కోఠి ప్రాంతంలో నివసిస్తున్న జబానాజ్‌(30)కు ఆజంపురా డివిజన్‌ ఫర్హత్‌నగర్‌కు చెందిన అక్బర్‌అలీఖాన్‌తో పదేళ్ల కిందట వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. ఉద్యోగ నిమిత్తం గత రెండేళ్లుగా ఖాన్ దుబాయ్‌లో నివశిస్తున్నాడు.
 
ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం నగరానికి వచ్చాడు. రంజాన్‌ మాసం సందర్భంగా షాపింగ్‌ కోసమని ఈనెల 19న అత్తగారి ఇంట్లో ఉన్న తన భార్యను తీసుకుని వెళ్లాడు. రాత్రివరకు ఎలాంటి సమాచారం లేకపోవడం, కుమార్తె ఫోన్ స్విచాఫ్ చేసివుండటంతో అనుమానం వచ్చిన తల్లి షబ్నం నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
ఇదిలావుంటే, ఫర్హత్‌నగర్‌లో హత్య జరిగిందని, శవాన్ని కాలువలో పడేశారని ఆదివారం సమాచారం రావడంతో స్థానికులు, డబీర్‌పురా పోలీసులు అక్కడ గాలించారు. కాలువ పక్కనే దొరికిన మూటలో శవం ఉండటంతో పోలీసులు మృతురాలి తల్లికి సమాచారం అందించారు. ఆమె మృతదేహాన్ని గుర్తించి డబీర్‌పురా ఠాణాలో ఫిర్యాదు చేశారు. అక్బర్‌అలీఖాన్‌ తన భార్యను హతమార్చి తిరిగి దుబాయ్‌కి వెళ్తివుంటాడని పోలీసులు భావిస్తున్నారు. కేసు దర్యాప్తు జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు