కోరిక తీర్చమన్న బావ... కుదరదన్న మరదలు.. ఆ తర్వాత..

మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (10:09 IST)
ఓ మరదలు బావ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంది. తన కోరిక తీర్చాల్సిందేనంటూ బావ పట్టుబట్టాడు. కానీ, మరదలు లొంగలేదు. అయినప్పటికీ  బావ వదలిపెట్టలేదు. శరపట్టాడు. దీంతో ఆ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామానికి శ్రీనివాసరావుకు, పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెంకు చెందిన గీతాసురేఖకు 12 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు మగపిల్లలు. భర్త శ్రీనివాసరావు ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. 
 
అయితే, శ్రీనివాస రావుకు అన్న శివశంకర్ ఉన్నాడు. తమ్ముడు శ్రీనివాసరావు అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని అన్న శివశంకర్‌ మరదలిపై కన్నేశాడు. తన కోరిక తీర్చాలంటూ వేధింపులకు దిగాడు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన గీతాసురేఖ జనవరి 15 వ తేదీన పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకొంది. 
 
అదే రోజు విజయవాడలో నివాసం ఉండే సురేఖ సోదరుడు రామకృష్ణ ఆమెకు ఫోన్‌ చేయగా లిఫ్ట్‌ చేయలేదు. అనుమానం వచ్చిన రామకృష్ణ సాయంత్రం 4 గంటల సమయంలో ఉండవల్లిలోని సురేఖ ఇంటికి వచ్చాడు. తమ కుమారుడు, కోడలు బయటకు వెళ్లారని మామ ఆదిశేషు రామకృష్ణతో చెప్పాడు.
  
పిల్లల్ని సైతం బెదిరించడంతో వారు కూడా అలాగే చెప్పి బోరున విలపించారు. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఆత్మహత్యాయత్నం చేసుకున్నా చెప్పకుండా దాచారు. పిల్లలు చెప్పడంతో విషయం బయటకు వచ్చింది. వెంటనే బాధితురాలిని విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ సోమవారం సురేఖ మృతి చెందింది. 
 
బావ శివశంకర్, మామ ఆదిశేషు, దీనికి కారణమైన మిగతా వారిపై కేసు నమోదు చేయాలని సురేఖ బంధువులు డిమాండ్‌ చేశారు. అమ్మకు ఏమైందో అర్థంకాక ఆ చిన్నారులిద్దరూ ఆస్పత్రిలో బెడ్‌ వద్దే బోరున విలపించారు. చివరకు తల్లి చనిపోయిందని తెలియడంతో పిల్లలు తట్టుకోలేక పోయారు. నిందితుడు శివశంకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు