ఉన్నఫళంగా తెలంగాణ అసెంబ్లీని రద్దు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది?

శుక్రవారం, 7 సెప్టెంబరు 2018 (17:48 IST)
ఉన్నఫళంగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని తెలంగాణ రాష్ట్రానికి చెందిన న్యాయవాది రాపోలు భాస్కర్ ప్రశ్నించారు. ఇలా చేయడం వల్ల రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. పైగా, ఇపుడు మళ్లీ ఎన్నికలకు వెళ్లడం వల్ల కోట్లాది రూపాయల ప్రజాధనం వ్యయం అవుతుందన్నారు.
 
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేస్తూ ఆ రాష్ట్ర మంత్రిమండలి ఏకవాక్య తీర్మానం చేసింది. దీన్ని ఆ రాష్ట్ర గవర్నర్ కూడా ఆగమేఘాలపై ఆమోదించారు. అంటే ఐదేళ్ళు పూర్తికాకముందే 4 సంవత్సరాల 3 నెలల 5 రోజులకే కేసీఆర్ సారథ్యంలోని తెరాస ప్రభుత్వం రద్దు అయింది. 
 
దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాపోలు భాస్కర్ అనే న్యాయవాది ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ప్రభుత్వం ఇంకా 9 నెలల ఉండగా ముందే అసెంబ్లీని రద్దు చేయడంపై పిటిషన్‌లో ఆయన అభ్యంతరాలను లేవనెత్తారు. ఉన్నఫళంగా అసెంబ్లీని రద్దు చేయడం వలన రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడుతుందని పిటిషన్‌లో ఆయన పేర్కొన్నారు. 
 
ఇప్పుడు మళ్ళీ ఎన్నికల వల్ల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందన్నారు. 5 సంవత్సరాలు పూర్తి అయ్యేంత వరకూ ఎలాంటి ఎన్నికలు జరగకుండా హైకోర్టు ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం విచారించనుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు