తెలంగాణలో కాంట్రాక్టులు కావాలంటే...రేవంత్ రెడ్డి తీసుకోవచ్చు: యనమల

సోమవారం, 30 అక్టోబరు 2017 (15:02 IST)
ఏపీ ఆర్థిక మంత్రి, సీనియర్ టిడిపి నేత యనమల రామకృష్ణుడికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండువేల కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్టులు ఇచ్చారని తెలంగాణ తెదేపా మాజీ నేత రేవంత్‌రెడ్డి సంచలన ఆరోపణ చేశారు. కేసీఆర్‌పై అందుకనే ఈగవాలనివ్వరన్నారు. పయ్యావుల కుమారుడు, యనమల అల్లుడు కలిసి మద్యం వ్యాపారం చేస్తున్నారన్నారని విమర్శలు గుప్పించారు. 
 
ఏపీలో కేసీఆర్ పరిటాల ఇంటికి పెళ్లికి వెళ్తే, తమను జైలులో పెడుతున్నా.. ఏపీ టీడీపీ నేతలు ఆయనకు వంగి, వంగి దండాలు పెట్టారని రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. అన్నం పెట్టినవారికే ఏపీ టీడీపీ నేతలు సున్నం పెడుతున్నారని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు. తనకు తెలంగాణలో కాంట్రాకులుంటే వాటిని రేవంత్‌రెడ్డి తీసుకోవచ్చనిని సెటైర్ వేశారు. ఒకవేళ కాంట్రాక్టులపై కమీషన్‌ వచ్చినా వాటినీ తీసుకోవచ్చని చెప్పారు. పార్టీ నుంచి వెళ్లడానికే రేవంత్‌ తనపై ఆరోపణలు చేశారేమో? అని మీడియాతో యనమల అన్నారు. 
 
ఇకపోతే.. తెదేపా వీడిన రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం దీనికి వేదిక కానుంది. మంగళవారం కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో రేవంత్‌ ఆ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో రేవంత్‌తోపాటు ఆయన అనుచరులు కూడా కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఇప్పటికే రేవంత్‌రెడ్డి తెదేపాకు, ఆ పార్టీ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. శాసనసభ సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా సమర్పించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు