మూడు రాజధానులపై మడమ తిప్పిన వైకాపా... అది అప్పటి విధానమట : బొత్స

ఠాగూర్

సోమవారం, 3 మార్చి 2025 (19:37 IST)
అధికారంలో ఉన్న ఐదేళ్లపాటు నవ్యాంధ్రకు మూడు రాజధానులను నిర్మిస్తామంటూ ఢంకా బజాయించిన వైకాపా నేతలు వెనక్కి తగ్గారు. గత సార్వత్రిక ఎన్నికల్లో మూడు రాజధానులకు కట్టుబడివున్నాంటూ పదేపదే ప్రకటనలు గుప్పించారు. కానీ ఆ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోవడంతో పాటు మూడు రాజధానుల అంశాన్ని రాష్ట్ర ప్రజలు తమ తీర్పు ద్వారా స్పష్టం చేశారు. 
 
అసెంబ్లీ ఎన్నికల్లో 151 నుంచి 11 సీట్లకు పడిపోయారు. దీంతో ఆ పార్టీ నేతలు పునరాలోచనలో పడ్డారు. మూడు రాజధానులే తమ పార్టీ విధానమని ఇప్పటివరకు గట్టిగా చెప్పిన వైకాపా నేతలు ఇపుడు వెనక్కి తగ్గారు. రాజధానిపై తమ విధానాన్ని పునరాలోచన చేస్తామని ఏపీ శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రకటించారు. 
 
అప్పట్లో ఉన్న పరిస్థితులను బట్టి తాము మూడు రాజధానుల వైపు వెళ్లామని బొత్స అన్నారు. రాజధానిపై ఇపుడు తమ విధానం ఏమిటనేది చర్చించి చెబుతామని స్పష్టం చేశారు. ఈ అంశంపై పార్టీలో సమగ్రంగా చర్చించి తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని పేర్కొన్నారు. అమరావతి శ్మశానంలా ఉందంటూ గతంలో తాను వ్యాఖ్యానించడం నిజమేనని అంగీకరించిన బొత్స.. ఆరేళ్ళ క్రితం అప్పటి సందర్భాన్ని బట్టి అలా మాట్లాడాల్సివచ్చిందని వివరణ ఇచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు