టీడీపీలో చేరేందుకు పయనమైన వైసీపీ నేత, గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్

బుధవారం, 11 నవంబరు 2020 (11:30 IST)
టీడీపీలో చేరేందుకు హైదరాబాదు పయనమైన వైసీపీ నేతను కొందరు గుర్తు తెలియని వ్యక్తు కిడ్నాప్ చేశారు. ఈ ఘటన హైదరాబాదు ఔటర్ రింగ్ రోడ్డులో జరిగింది. గుంటూరు జిల్లా పెదకూరుపాడు నియోజకవర్గంలోని చండ్రాజు పాలేనిని చెందిన వైసీపీ నేత గాదె వెంకటరెడ్డి టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.
 
ఇందులో భాగంగా తన అనుచరులతో కలిసి నిన్న ఉదయం హైదాబాదులోని ఎన్టీఆర్ భవన్‌కు బయలుదేరారు. ముందు ఆయన వాహనంలో వెళ్తుండగా మరో వందమంది ఆయన అనుచరులు ఎడెనిమిది వాహనాల్లో బయలు దేరారు. అయితే వారు మిర్యాలగూడ  చేరుకునేసరికి గుర్తు తెలియని వ్యక్తులు వెంకటరెడ్డిని కారులో ఎక్కించుకుని కిడ్నాప్ చేశారు. దీంతో తమ అనుచరులు ఏమీ చేయలేక వెనుదిరిగారు.
 
విషయం తెలుసుకున్న వెంకటరెడ్డి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. అయితే సాయంత్రం ఏడు గంటల సమయంలో తాను హైదరాబాదులో క్షేమంగా ఉన్నానని ఫోన్లో తెలపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గత కొన్నాళ్లుగా వైసీపీపై విరక్తి చెందిన వెంకట రెడ్డి టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేరనీయకుండా అడ్డుకున్నారని తెలిపారు. ఇదంతా వైసీపీ కుట్ర అని తెలిపారు. కానీ దీనిపై కేసు నమోదు కాలేదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు