పవన్ కల్యాణ్‌పై రోజా సెటైర్లు.. వారసత్వ సినిమాల సంగతేంటి?

గురువారం, 7 డిశెంబరు 2017 (12:03 IST)
ప్రముఖ సినీనటుడు, జనసేనాని పవన్ కల్యాణ్‌‌ను లక్ష్యంగా చేసుకుని వైకాపా ఎమ్మెల్యే ఆర్కే. రోజా విమర్శలు గుప్పించారు. పాలకుడు అవినీతిపరుడైతే ప్రజలపై ప్రభావముంటుందని, అందుకే వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు గత ఎన్నికల్లో మద్దతివ్వలేదని చెప్పిన పవన్... ముఖ్యంగా వారసత్వ రాజకీయాలపై ఘాటైన విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలపై రోజా తనదైనశైలిలో స్పందించారు. 
 
ఆమె గురువారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ, వారసత్వ రాజకీయాలకంటే ముందు పవన్ కల్యాణ్ వారసత్వ సినిమాలపై మాట్లాడితే బాగుంటుందన్నారు. హీరో చిరంజీవి లేకపోతే పవన్ కల్యాణ్ అనే వ్యక్తి లేరనీ రోజా అభిప్రాయపడ్డారు. అలాగే ప్రత్యేక హోదా కోసం పవన్ కల్యాణ్ ఇచ్చిన పిలుపు సంగతి ఏమైందని ఆమె ప్రశ్నించారు. 
 
పవన్ కల్యాణ్ మాట్లాడే మాటలకు చేతలకు పొంతన ఉండదన్నారు. బోటు బోల్తా పడిన సంఘటన ఎక్కడో లండన్‌ విద్యార్థి చెప్తేనే తెలిసిందా? రాష్ట్రంలోవుండి ఈ ఘటన ఆయనకు తెలియలేదా? ఇది సిగ్గుచేటన్నారు. పార్టీ పెట్టి ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తానన్న పెద్దమనిషి, బోటు బాధితులను పరామర్శించలేదని మండిపడ్డారు. 
 
ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా ధర్నా చేస్తుంటే లారీతో గుద్దిచంపేస్తే ఆయనకు కనిపించదా? టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి బస్సు ప్రమాదం ఆయనకు గుర్తులేదా? అదే ఆంధ్రజ్యోతి ఆఫీసు అగ్నిప్రమాదానికి గురైతే వెళ్లి చూసేందుకు పవన్‌కు సమయముందికానీ, ఈనాడు పేపర్లో వచ్చిన వార్త ఆయనకు కనిపించలేదా? అని నిలదీశారు. వ్యభిచార కూపంలోకి వెళుతున్న మహిళల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందనీ రోజా ఆవేదన వ్యక్తంచేశారు. మహిళలకు రక్షణ కల్పించలేని తెదేపా సర్కారుకు, ఆ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్న పవన్ కల్యాణ్‌కూ ఈ పరిస్థితి సిగ్గుచేటన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు