జనసేన పార్టీలో చేరనున్న వైకాపా ఎమ్మెల్సీ బొత్స సోదరుడు

ఠాగూర్

గురువారం, 26 సెప్టెంబరు 2024 (12:37 IST)
అధికారం కోల్పోయిన వైకాపాకు వరుస దెబ్బలు తలుగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు పార్టీని వీడుతున్నారు. వీరిలో రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల నుంచి ద్వితీయ శ్రేణి నేతల వరకు ఉన్నారు. ఇపుడు విజయనగరం జిల్లాలో వైకాపాకు మరో దెబ్బ తగిలింది. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సోదరుడు లక్ష్మణరావు త్వరలో జనసేన పార్టీలో చేరబోతున్నారు. 
 
వ్యాపార రంగంలో ఉన్న లక్ష్మణరావు ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి రావాలని పదేళ్ల నుంచి ప్రయత్నిస్తున్నారు. జిల్లాలో సామాజికంగా అనుకూలత ఉన్న ఏ స్థానం నుంచైనా పోటీ చేయాలని అనుకున్నా అవకాశం రాలేదు. మొన్నటి ఎన్నికల్లో నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి వైకాపా అభ్యర్థిగా పోటీ చేసిన బడ్డుకొండ అప్పలనాయుడుకు వ్యతిరేకంగా పనిచేసినట్లు ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగింది.
 
తన అనుచరులుగా ఉన్న ఏడుగురు సర్పంచులను జనసేనలోకి పంపి, తద్వారా కూటమి విజయానికి పరోక్షంగా కృషి చేశారని సమాచారం. ఈ ఎన్నికల్లో వైకాపా ఘోర పరాజయం చవిచూసిన తర్వాత ఆ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. దసరా తర్వాత ముహూర్తం చూసుకుని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. ఇదే విషయాన్ని బొత్స లక్ష్మణరావు వద్ద ప్రస్తావించగా, పార్టీ మార్పు పక్కా అని, పార్టీలో చేరే ముందు అన్ని విషయాలూ వెల్లడిస్తానని ఆయన పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు