నా బాణం లక్ష్యం చంద్రబాబు.. పవన్‌తో చేతులు కలుపుతా : జగన్ మోహన్ రెడ్డి

ఆదివారం, 5 ఫిబ్రవరి 2017 (10:08 IST)
తన బాణం లక్ష్యం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని ఇందుకోసం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌తో చేతులు కలిపేందుకు సిద్ధమని వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ఇప్పటికే, ప్రత్యేక హోదా కోసం జగన్‌తో కలిసేందుకు సిద్ధమని పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం తెల్సిందే. 
 
దీంతో తాజాగా జగన్ కూడా ఇదే తరహా సంకేతాలు పంపించారు. తాము కూడా పవన్‌తో జత కట్టేందుకు సిద్ధమన్నారు. తద్వారా, నారా చంద్రబాబు నాయుడిను అధికారానికి దూరం చేయడమే లక్ష్యంగా, 2019లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ స్థాపించిన జనసేన పార్టీతో పొత్తు పెట్టుకునే అంశంపై జగన్ పార్టీ నుంచి సానుకూల సంకేతాలు రావడం గమనార్హం.
 
మరోవైపు... చంద్రబాబును అడ్డుకునేందుకు జనసేన సహా, సీపీఐ, సీపీఎం తదితర భావ సారూప్యమున్న పార్టీలతో పొత్తుకు సిద్ధమని ఆ పార్టీ నేత, ఎంపీ విజయ సాయి రెడ్డి ప్రకటించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధన క్రమంలో తమతో ఎవరు కలిసి వచ్చినా స్వాగతిస్తామన్నారు. హోదా కోసం వారితో కలసి పోరాడేందుకు సిద్ధమని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఏపీకి తీరని ద్రోహం చేసిందని, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని ఏపీ ప్రజలు ఎన్నడూ విశ్వసించే అవకాశం లేదని, అటువంటి ద్రోహం చేసిన పార్టీతో తాము సంబంధాలు పెట్టుకోబోమన్నారు.

వెబ్దునియా పై చదవండి