ఏపీకి చంద్రబాబు ఓ దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి : విజయసాయి రెడ్డి

మంగళవారం, 12 జూన్ 2018 (13:43 IST)
టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైకాపాకు చెందిన రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మరోమారు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ, లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా గోబెల్స్ ప్రచారం చేయడంలో చంద్రబాబును మించినవారు లేరన్నారు.
 
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఒక్క రోజులోనే 13 వేల క్యూబిక్ మీటర్ల పనులను చేశామని చంద్రబాబు అన్నారని... ఇదే విషయాన్ని తిరుమల వెంకన్న మీద ప్రమాణం చేసి చెప్పగలరా? అని ప్రశ్నించారు. అబద్ధపు ప్రచారాలతో తెలుగు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. 
 
ఇకపోతే, తెలంగాణ ప్రాంతానికి చెందిన టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులును తాను కలవాలని అనుకోలేదని... కానీ, చంద్రబాబు చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆయనను తప్పకుండా కలుస్తానని చెప్పారు. ఒక దళితనేతను కలిస్తే తప్పేముందని ప్రశ్నించారు. మోత్కుపల్లిని తాను కలిస్తే చంద్రబాబుకు భయం ఎందుకన్నారు. 
 
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటివరకు రూ.3 లక్షల కోట్ల నల్లధనాన్ని విదేశాలకు తరలించారని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. దేవుని డబ్బు సైతం తండ్రి కొడుకులు కలిసి దోచుకుంటున్నారని మండిపడ్డారు. రానున్న రోజుల్లో చంద్రబాబు, లోకేశ్‌లు జైలుకు వెళ్లక తప్పదని ఆయన జోస్యం చెప్పారు. 
 
గత ఎన్నికల ప్రచార సమయంలో చంద్రబాబు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారని, ఆయన్ను ప్రజలు మరోమారు నమ్మబోరన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మించడం చంద్రబాబుతో సాధ్యం కాదన్నారు. అది వైఎస్‌ఆర్‌ కల అని, తమ ప్రభుత్వం ఏర్పడితే పోలవరాన్ని నిర్మాణం పూర్తి చేస్తామని విజయసాయి రెడ్డి చెప్పుకొచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు