చివరి ఐదవ విడత పోలింగ్ ప్రారంభం

దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా చివరి ఐదవ విడత పోలింగ్ ప్రారంభమైంది. ఈ పోలింగ్ ఏడు రాష్ట్రాలు మరియు రెండు కేంద్ర పాలిత ప్రాంతాలలో మొత్తం 86 ఎంపీ సీట్లకుగాను బుధవారం ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఈ రోజు సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కార్యక్రమం జరుగుతుంది. ఎన్నికల ఫలితాలు మేనెల 16వ తేదీన ప్రకటించడం జరుగుతుంది.

15వ లోక్‌సభకు గాను ఐదు విడతలుగా జరుగుతున్న ఎన్నికలలో చివరి విడత ఎన్నికల పోలింగ్‌లో దాదాపు 10 కోట్ల 78లక్షల మంది ప్రజలు 1లక్ష 21వేలకుపైగా పోలింగ్ కేంద్రాలలో 1432మంది భవిష్యత్తును తేల్చనున్నారు. వీరిలో 93మంది మహిళలుకూడా పోటీలో పాల్గొంటున్నారు.

చివరి విడత పోలింగ్ సందర్భంగా ఎన్నికల సంఘం ప్రజలు నిష్పక్షపాతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి మొత్తం 264మంది పర్యవేక్షకులను నియమించింది. వీరిలో పదిమంది ప్రత్యేక పర్యవేక్షకులుగా ఉంటారు. వీరిలో ఎనిమిదిమందిని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోనూ, ఒకరిని ఉత్రప్రదేశ్‌లోనూ, మరొకరిని తమిళనాడు రాష్ట్రంలో పర్యవేక్షించడానికి నియమించిందిం.

చివరి విడతలో భాగంగా హిమాచల్ ప్రదేశ్‌లో 4, జమ్మూ-కాశ్మీర్‌లో 2, పంజాబ్‌లో 9, తమిళనాడులో మొత్తం 39, ఉత్తరప్రదేశ్‌లో 14, ఉత్తరాఖండ్‌లో మొత్తం 5, పశ్చిమబెంగాల్‌లో 11, చండీగఢ్‌, పుదుచ్చేరిలో చెరి ఒక స్థానాలకు పోటీ జరుగుతోంది.

చివరి దశపోలింగ్‌లో పోటీ చేస్తున్న ప్రముఖులు...కేంద్ర హోంశాఖ మంత్రి పి. చిదంబరం, కేంద్ర మంత్రి మణిశంకర్ అయ్యర్, కేంద్ర రవాణాశాఖ మంత్రి టీ.ఆర్.బాలు, సంచారశాఖ మంత్రి ఏ. రాజా, మాజీ క్రికెటర్ ముహమ్మద్ అజహరుద్దీన్ మరియు తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీల్లాంటి దిగ్గజాలు పోటీలో తలపడుతున్నారు.

వీరుకాకుండా తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్. కరుణానిధి కుమారుడు, ద్రవిడ మున్నేట్ర కళగం నాయకుడైన అళగిరి తమిళనాడులోని మదురై లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తున్నారు.

ఇదిలావుండగా మరికొందరు ఎన్నికలలో పోటీకి తలపడేవారు మేనకాగాంధీ, వరుణగాంధీ, ప్రముఖ సినీ దిగ్గజాలు నటి జయప్రద, వినోద్ ఖన్నా, మాజీ క్రికెటర్ నవజోత్ సిద్ధూ, బీజేపీ మైనారిటీ నాయకుడు ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ తదితరులు పోటీలో తమ భవిష్యత్తును పరీక్షించుకోనున్నారు.

వెబ్దునియా పై చదవండి