నాటి స్వప్నం నెరవేరే సమయం... భావోద్వేగానికి లోనైన బీజేపీ కురువృద్ధుడు

బుధవారం, 5 ఆగస్టు 2020 (08:54 IST)
నాటి స్వప్నం నెరవేరే సమయం ఆసన్నమైంది. దీనికి మూలకారకుడు ఎల్కే.అద్వానీ. ఆయన రామమందిర భూమిపూజా కార్యక్రమంపై ఎంతో భావోద్వేగంతో స్పందించారు. ఇదో చారిత్రాత్మక సమయమని వ్యాఖ్యానించారు. భారతావనిలోని ప్రతి హిందువు కలా నెరవేరనుందని అభిప్రాయపడ్డ ఆయన, ఇంతకన్నా తన నోటి వెంట మాటలు రావడం లేదని అన్నారు. 
 
నిజానికి రామజన్మభూమి - బీజేపీకి మధ్య మంచి అవినాభావ సంబంధం ఉంది. ఈ రెండు పేర్లు వినగానే ప్రతి ఒక్కరికీ మరో రెండు పేర్లు గుర్తుకు వస్తాయి. అవే ఎల్కే. అద్వానీ - రథయాత్ర. 1980 దశకం చివరి నుంచి 1990 దశకం ప్రారంభం వరకూ రామ్ రథ యాత్ర పేరిట సోమనాథ్ నుంచి అయోధ్య వరకూ అద్వానీ నేతృత్వంలో ఈ యాత్ర జరిగింది. 
 
ఈ యాత్రే బీజేపీని దేశంలో తొలిసారి అధికారంలోకి తీసుకొచ్చింది. అయితే ఇది జరిగి మూడు దశాబ్దాలు గడిచిపోయింది. అపుడు ఎంతో చలాకీగా కనిపించిన అద్వానీ ఇపుడు బీజేపీ కురువృద్ధుడిగా, భీష్ముడిగా మారిపోయి అంపశయ్యపై ఉన్నట్టుగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ తన ఇంటికే పరిమితమయ్యారు.
 
అయితే, నాటి తన కల నెరవేరే సమయం ఇప్పుడు ఆసన్నం కావండతో ఆయన తీవ్ర భావోద్వాగానికి గురవుతున్నారు. ఇది ఓ చారిత్రక సమయమని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం 92 సంవత్సరాల వయసులో ఉన్న ఆయన, తన హృదయానికి ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉందని, తనకు అక్కడికి వెళ్లాలని కోరికగా ఉన్నా, వెళ్లలేకున్నట్టు చెప్పుకొచ్చారు. రామజన్మభూమిలో మందిర నిర్మాణం బీజేపీ కలని, రథయాత్ర ద్వారా ఈ ఉద్యమంలో పాల్గొనడం ద్వారా తన కర్తవ్య ధర్మాన్ని నిర్వర్తించానని అన్నారు.
 
అయితే, ఈ రథయాత్రలో అద్వానీతో పాటు పాల్గొన్న మరో సీనియర్ నేత మురళీమనోహర్ జోషి. కానీ, రామాలయం శంకుస్థాపనకు తొలుత వీరిద్దరికీ ఆహ్వానం వెళ్లలేదు. దీంతో రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. చివరకు వీరికి ఫోన్ చేసిన కార్యక్రమ నిర్వాహకులు ఆహ్వానం పలికారు. ఆపై అద్వానీ తన వీడియో స్టేట్మెంట్‌ను విడుదల చేస్తూ, భరతజాతి ఐక్యతకు ఈ ఆలయం సూచికగా నిలుస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు