ఆంధ్రప్రదేశ్‌: రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్‌కి దూరంగా ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు

సోమవారం, 18 జులై 2022 (22:26 IST)
రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌లో ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 175 మందికి గానూ 173 మంది ఎమ్మెల్యేలు ఓటు వేసినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఓటు హక్కు వినియోగించుకోని ఇద్దరూ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు. హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేతికి గాయం కావడంతో ఓటింగ్‌కి దూరంగా ఉన్నారు. మరో సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అమెరికా పర్యటనలో ఉన్నారు. దాంతో ఆయన కూడా ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు.

 
అధికార పార్టీకి చెందిన 150 మంది ఎమ్మెల్యేలు అమరావతిలో ఓటు వేయగా.. కందుకూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎం మహేందర్ రెడ్డి మాత్రం హైదరాబాద్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. దాంతో వైఎస్సార్సీపీకి చెందిన 151 మంది ఎమ్మెల్యేలూ ఓటు వేసినట్టయ్యింది. వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ శాసన సభా భవనంలో సోమవారం ఉదయం 10 గంటలకు పోలింగ్ ప్రారంభమయ్యింది. తొలుత రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఓటు వేశారు.

 
సాయంత్రం 5 గంటలకు ఓటింగ్ పూర్తయిన వెంటనే రాష్ట్రంలో పోలైన ఓట్ల బ్యాలెట్ బాక్సును ఎన్నికల పరిశీలకులు చంద్రేకర్ భారతి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి కె. రాజ్ కుమార్ సమక్షంలో సీళ్లు వేసి స్ట్రాంగ్ రూమ్ లో భద్రపర్చారు. మంగళవారం ఉదయం విమానంలో దిల్లీలోని పార్లమెంట్ భవనానికి పంపేందుకు అధికారులు ఏర్పాటు చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు