ఈ విధానం "మానసిక క్షోభకు" గురి చేస్తోందని కొందరు ఫిర్యాదు చేశారని జపాన్ అధికారులు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తిని చాలావరకూ అదుపులోకి తెచ్చిన చైనా జనవరిలో మలద్వారం (ఆనల్) స్వాబ్ టెస్టులు చేయడం ప్రారంభించింది. అమెరికా దౌత్యవేత్తలకు కూడా ఇలాంటి పరీక్షలు చేశారని గతవారం అమెరికా మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే, చైనా ఆ వార్తలను ఖండించింది.
"మలద్వారం స్వాబ్ టెస్టుల వల్ల తాము మానసిక వేదన అనుభవించామని కొందరు జపనీయులు చైనాలోని మా రాయబార కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. ఎంత మంది జపాన్ పౌరులు ఈ టెస్టుల బారిన పడ్డారో ఇంకా తెలియదు" అని జపాన్ చీఫ్ క్యాబినెట్ సెక్రటరీ కట్సునోబు కటో తెలిపారు. చైనాలో అడుగు పెట్టినవారికి, క్వారంటీన్లో ఉన్న కొందరికి ఈ ఆనల్ స్వాబ్ టెస్టులు నిర్వహించారు.
"ఈ టెస్టులు ఎంత ఉపయోగకరం అనేది ఇంతవరకూ ప్రపంచంలో ఎవరూ ధృవీకరించలేదు" అని కటో అన్నారు. ఈ టెస్టులు నిర్వహించొద్దంటూ బీజింగ్లోని జపాన్ రాయబార కార్యాలయం చేసిన వినతికి చైనా ఇంతవరకూ స్పందించలేదు. ఆనల్ స్వాబ్ టెస్టుల వల్ల "వైరస్ సోకినవారిని గుర్తించే రేటు పెరుగుతుందని" కొందరు స్థానిక చైనా నిపుణులు అంటున్నారు.
అయితే, ఈ పద్ధతిపై నిపుణుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, ముక్కు ద్వారా చేసే స్వాబ్ టెస్టులతో పోలిస్తే మలద్వారం స్వాబ్ టెస్టులు అంత సమర్థవంతం కావని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నట్లు ఈ పద్ధతిని ప్రారంభించిన తొలిరోజుల్లో చైనా ప్రభుత్వ మీడియా ప్రచురించింది.