కాశ్మీర్ అంశంలో మూడో పార్టీకి చోటు లేదు : ట్రంప్‌కు తేల్చిచెప్పిన నరేంద్ర మోడీ

సోమవారం, 26 ఆగస్టు 2019 (19:52 IST)
భారత్, పాకిస్థాన్ మధ్య సమస్యలను తమకుతాముగానే పరిష్కరించుకోగలమని, దానికి మూడో వ్యక్తి జోక్యం అవసరం లేదని భారత ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి స్పష్టం చేశారు. జీ7 సదస్సులో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం ఇద్దరు నేతలూ మీడియా సమావేశంలో మాట్లాడారు.
 
"ఇటీవల ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన మోదీని అభినందించాను. వాణిజ్యం, సైన్యం గురించి, ఇంకా ఎన్నో అంశాలపై మాట్లాడుకున్నాం" అని ఈ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించారు. అనంతరం మాట్లాడిన మోడీ... సోమవారం నా మిత్రుడు, ప్రపంచంలో అత్యంత పురాతన ప్రజాస్వామ్య దేశాధ్యక్షుడిని కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు.
 
"ఎప్పుడు అవకాశం దొరికినా మేం కలుస్తూనే ఉన్నాం. భారత్ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. సుమారు 700 మిలియన్ ఓటర్లు గత ఎన్నికల్లో ఇలాంటి ఫలితాలివ్వడం ప్రపంచంలోనే మొదటిసారి అనుకుంటా. ఫోన్ చేసి అభినందించినందుకు కృతజ్ఞతలు.
 
భారత్ అమెరికా.. ప్రజాస్వామ్య విలువలను ముందుకు తీసుకెళ్లే దేశాలు. ప్రపంచ క్షేమం కోసం కలిసి పనిచేయడం, భాగస్వామ్యం అందించడం, మా ఉమ్మడి విలువలతో మానవజాతికి, ప్రపంచాభివృద్ధికి ఉపయోగపడడం లాంటి ఎన్నో విషయాలపై చాలా లోతుగా చర్చిస్తుంటాం.
 
ఆర్థిక, వాణిజ్య రంగాలలో భారత్, అమెరికా చర్చలు నిరంతరం కొనసాగుతున్నాయి. చాలా అంశాల్లో మేం అమెరికా కల్పించిన సౌకర్యాలను స్వాగతిస్తున్నాం. మేం కలిసి వాణిజ్య రంగంలో ముందుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నాం.
 
భారత సమాజం అమెరికాలో భారీ పెట్టుబడులు పెడుతోంది. అమెరికా అభివృద్ధిలో భారత సమాజం ఎంత భాగస్వామ్యం అందిస్తోందో, అమెరికా కూడా భారత సమాజానికి అంత గౌరవం, ఆదరణ ఇస్తోంది. దానికి నేను అధ్యక్షుడు ట్రంప్, ఆయన ప్రభుత్వానికి, అక్కడి ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు చెబుతున్నాను" అని మోడీ వ్యాఖ్యానించారు.
 
కాశ్మీర్ అంశంపై ఎవరేమన్నారు? 
ట్రంప్ - మేం కశ్మీర్ గురించి చర్చించాం. అక్కడ పరిస్థితి అదుపులో ఉందని భారత ప్రధాని అన్నారు. మోడీ- భారత్, పాకిస్తాన్ మధ్య ఎన్నో ద్వైపాక్షిక అంశాలున్నాయి. పాక్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత నేను ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఫోన్ చేశాను. పాక్ పేదరికంతో పోరాడాలి, భారత్ కూడా. భారత్-పాక్ నిరక్షరాస్యత, వ్యాధులపై కూడా పోరాడాలని చెప్పాను. పేదరికం సహా, అన్ని సమస్యలపై మనం కలిసి పోరాడదాం అని చెప్పాను. రెండు దేశాల ప్రజల సంక్షేమం కోసం కలిసి పనిచేద్దాం అని చెప్పాను. అధ్యక్షుడు ట్రంప్‌తో కూడా ఎప్పుడూ ఈ ద్వైపాక్షిక సంబంధాలపై మాట్లాడుతూనే ఉన్నాను.
 
కాశ్మీర్ అంశంలో అమెరికా జోక్యం అంగీకరిస్తారా? 
మోడీ - భారత్, పాక్ మధ్య ఉన్న అన్ని సమస్యలు ద్వైపాక్షికం. అందుకే మేం ప్రపంచంలోని ఏ దేశాన్నీ దానికోసం ఇబ్బందిపెట్టం. భారత్-పాకిస్తాన్ 1947కు ముందు కలిసే ఉన్నాయి. మా రెండు దేశాలూ కలిసి మా సమస్యలపై చర్చించుకోగలం, దానికి పరిష్కారం కూడా వెతకగలమనే నమ్మకం నాకుంది.
 
ట్రంప్ - మా మధ్య మంచి సంబంధాలున్నాయి. కాబట్టే నేను ఇక్కడున్నా. వాళ్లు చాలా రోజుల నుంచీ అలా చర్చలు జరుపుతున్నారు. ఈ సమస్యలను వారే పరిష్కరించుకుంటారని భావిస్తున్నాను. మోడీ మంచి ఇంగ్లీష్ మాట్లాడతారని, కానీ ఈరోజు ఎందుకో హిందీలో మాట్లాడుతున్నారు అని ట్రంప్ సరదాగా వ్యాఖ్యానించగా, మోడీ నవ్వుతూ ట్రంప్ చేతులపై గట్టిగా తట్టారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు