‘దేశంలోని సీసీ కెమెరాల్లో 65 శాతం ఒక్క తెలంగాణలోనే ఉన్నాయి’ - ప్రెస్ రివ్యూ

శుక్రవారం, 7 ఫిబ్రవరి 2020 (09:50 IST)
దేశవ్యాప్తంగా ఏడాది క్రితం వరకు ఏర్పాటైన సీసీ కెమెరాల్లో దాదాపు 65 శాతం ఒక్క తెలంగాణలోనే ఉన్నాయంటూ ‘ఈనాడు’ దినపత్రిక ఓ వార్త రాసింది. 2019 జనవరి 1 నాటికి దేశవ్యాప్తంగా పోలీస్‌ సంస్థలకు సంబంధించిన వివరాలతో పోలీన్‌ పరిశోధన, అభివృద్ధి సంస్థ (బీపీఆర్‌డీ) 'డేటా ఆన్‌ పోలీన్‌ ఆర్గనైజేషన్స్‌' నివేదిక విడుదల చేసింది.

 
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 2019, జనవరి 1 నాటికి మొత్తం 4,27,529 సీసీ కెమెరాలు ఏర్పాటయ్యాయని.. ఇందులో 2,75,528 తెలంగాణలోనే ఉన్నాయని ఆ నివేదిక పేర్కొంది. మొత్తం కెమెరాల్లో ఇది దాదాపు 65శాతం. 

 
తమిళనాడు రెండో స్థానంలో ఉంది. అక్కడ సీసీ కెమెరాల సంఖ్య 40,112. తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర (39,587), మధ్య ప్రదేశ్ (21,206) ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 14,770 సీసీ కెమెరాలున్నాయి. మిగతా రాష్ట్రాల్లో వీటి సంఖ్య పదివేల లోపే. 19 రాష్ట్రాల్లో కనీసం వెయ్యి చొప్పునైనా సీసీ కెమెరాలు లేవు.

 
పోలీస్‌ కమిషనరేట్ల సంఖ్యపరంగా తెలంగాణ దేశంలో రెండో స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా మొత్తం 63 కమిషనరేట్లుండగా.. రాష్ట్రంలో వాటి సంఖ్య తొమ్మిది. నేరాల నియంత్రణ దర్యాప్తులో సీసీ కెమెరాలు కీలకం కావడంతో తెలంగాణ పోలీస్ శాఖ వీటి ఏర్పాటును అవశ్యంగా భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు