వచ్చే ఐదేళ్ళలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం: విత్తమంత్రి జైట్లీ

బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (11:45 IST)
వచ్చే ఐదేళ్లలో దేశంలోని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. ఆయన బుధవారం లోక్‌సభలో 2017-18 సంవత్సర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన తన ప్రసంగంలో చేసిన కీలక వ్యాఖ్యలను పరిశీలిస్తే... 
 
గత యేడాది వర్షాలు బాగా కురిసిన కారణంగా ఈ ఏడాది వ్యవసాయ రంగం 4.1 శాతం వృద్ధి సాధిస్తుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. రైతులకు ఈసారి రికార్డు స్థాయిలో రూ.10 లక్షల కోట్లు రుణాలు ఇచ్చేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. తొలి 60 రోజులు వడ్డీలేని రుణ ఇస్తామని, రైతుల ఆదాయం ఐదేళ్లలో రెట్టింపు చేస్తామని ప్రకటించారు. ఈ ఆదాయ రెట్టింపునకు మార్గదర్శకాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. 
 
అలాగే, దేశంలోని ప్రతి కృషి విజ్ఞాన్ కేంద్రాల్లో భూసార పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. సాయిల్ హెల్త్ కార్డుల జారీ వేగం పుంజుకుందని తెలిపారు. ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూకాశ్మీర్‌లో వ్యవసాయ రంగానికి 60 రోజుల వడ్డీ మినహాయింపు ఇస్తున్నట్టు తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల నుంచి బయటపడేందుకు పంటల బీమా యోజన పథకాన్ని ప్రవేశపెట్టినట్టు తెలిపారు. ఈ పథకం కింద మరో 40 శాతం కవరేజ్ పెంచుతున్నట్టు తెలిపారు.
 
సాగునీటి సౌకర్యం కోసం రూ. 40 వేల కోట్లతోకార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈనామ్‌లు 240 నుంచి 500లకు పెంచుతున్నట్టు తెలిపారు. 2017-18లో జీడీపీ 7.6 శాతంగా ఉంటుందని, 2018-19లో జీడీపీ 7.8 శాతంగా ఉంటుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసినట్టు తెలిపారు. భారత్ ఉత్పాదక రంగంలో ప్రపంచంలో 9వ స్థానం నుంచి 6వ స్థానానికి ఎదిగిందని చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి