రానున్న రోజులు నిరుద్యోగులకు ఆశాజనకం!

FILE
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థికమాంద్యం కారణంగా పలు కంపనీలు ఉద్యోగులను ఇండ్లకు పంపిస్తున్న విషయం విదితమే. ప్రస్తుతం భారతదేశం ఆర్థికంగా పుంజుకుంటోంది. అన్ని రంగాలలోను వ్యాపారపరంగా వృద్ధి జరిగే సూచనలు కనపడుతున్నాయని సర్వే తెలిపింది. దీంతో భవిష్యత్తులో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలున్నాయంటున్నారు ఆర్థిక నిపుణులు.

గ్లోబెల్‌ స్టాఫింగ్‌ సర్వీసెస్‌ మ్యాన్‌‌పవర్‌ ఇండియా సంస్థ చేపట్టిన సర్వేననుసరించి ఆర్థికరంగం‌, బీమా‌, రియల్‌ ఎస్టేట్‌ రంగాలు మళ్లీ గాడిలో పడుతున్నాయని సంస్థ తెలిపింది. ఆయా రంగాలకు చెందిన సంస్థలు రానున్న రెండు మాడు నెలల్లో 25 శాతం ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఉత్సాహాన్ని చూపిస్తున్నాయి.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం నాటికి 25 శాతం మందిని ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు చర్యలు చేపట్టినట్లు పలు కంపనీలు తెలిపినట్లు సమాచారం. ప్రపంచ వ్యాప్తంగా 35 దేశాల్లో సర్వే నిర్వహించింది. ఏ దేశంలోనూ ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సుముఖత చూపలేదని సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ నరేశ్‌ మల్హాన్‌ తెలిపారు.

నిరుడు ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం నుంచి భారత్‌లో ఉద్యోగావకాశాలు మెరుగుపడుతున్నాయని ఆయన తెలిపారు. వచ్చే రెండు నెలల్లో 19 శాతం ఉద్యోగాల భర్తీ జరగవచ్చన్నారు. ఒక్క భారతదేశంలోనే దాదాపు 30 నగరాల్లో తమ సంస్థ సర్వే నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రంగానికి పెద్ద పీట పేయడంతో ఆయా రంగాల్లోని సంస్థలు మెరుగైన ఉద్యోగులను త్వరగా నియమించుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.

వెబ్దునియా పై చదవండి