జియో దెబ్బకు బీఎస్‌ఎన్ఎల్ ఉద్యోగులకు జీతాల్లేవ్!

బుధవారం, 13 మార్చి 2019 (12:34 IST)
రిలయన్స్ జియో దెబ్బకు ప్రైవేట్ టెలి ఆపరేటర్లతోపాటు ప్రభుత్వ రంగ బిఎస్ఎన్ఎల్ కూడా కుదేలైపోయింది. ఈ మేరకు ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. కంపెనీ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కారణంగా దాదాపు 1.6 లక్షల మంది ఉద్యోగులకు ఫిబ్రవరి నెల వేతనాలను చెల్లించడంలో విఫలమైంది. బీఎస్ఎన్ఎల్ చరిత్రలో ఉద్యోగులకు వేతనాలు చెల్లించకుండా డిఫాల్ట్ కావడం ఇదే తొలిసారి. 
 
ఈ విషయమై ఉద్యోగుల సంఘాలు ఇప్పటికే టెలికామ్ మంత్రి మనోజ్ సిన్హాకు లేఖ కూడా రాసాయి. ఇందులో వేతనాల చెల్లింపుల కోసం సంస్థకు నిధులు విడుదల చేయాలని కోరడంతోపాటు సంస్థ పునరుద్ధరణకు తగిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేసారు. బీఎస్ఎన్ఎల్ సంస్థ ఆదాయంలో దాదాపు 55 శాతం వేతనాల చెల్లింపులకు పోతుంది. అదేసమయంలో కంపెనీ వేతన బిల్లు వార్షికంగా 8 శాతం మేరకు పెరిగింది. అయితే ఆదాయం మాత్రం పెరగడం లేదు. 
 
టెలికాం పరిశ్రమ ఆర్థిక ఇబ్బందుల్లోకి జారుకోవడానికి కారణం కేవలం రిలయన్స్ జియో అందజేస్తున్న ధరల పోటీనే అని లేఖలో పేర్కొన్న యూనియన్లు ఇతర టెలికాం సంస్థలు కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయనీ, అయితే అవి ఎలాగోలా పరిస్థితులను నెట్టుకొచ్చేస్తున్నాయని తెలియజేసారు.
 
కాగా, మార్చి నెల వేతనాలు కూడా ఆలస్యమయ్యే అవకాశముందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు బీఎస్ఎన్ఎల్ బోర్డు.. బ్యాంక్ రుణానికి ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. అయితే టెలికాం విభాగం ఇందుకు నిరాకరించినట్లు సమాచారం. ఎట్టకేలకు జియో దెబ్బకు మరో సంస్థ కూడా బోర్డ్ తిప్పేటట్లుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు