పరిమితికి మించిన లావాదేవీలపై భారీ వడ్డింపుకు వ్యతిరేకంగా ప్రజలు నిరసన వ్యక్తం చేయడంతో ప్రైవేట్ బ్యాంకులు వివరణ ఇచ్చాయి. నగదు లావాదేవీల సంఖ్యను నాలుగుకు కుదిస్తూ హెచ్డీఎ్ఫసీ, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకులు పరిమితులు విధించడమేగాక.. నాలుగు లావాదేవీలు దాటితే రూ.150 వడ్డింపు విధించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ ఆంక్షలు, చార్జీల విధింపు బ్యాంకుల్లో జరిపే లావాదేవీలకే వర్తిస్తాయని, ఏటీఎంలలో జరిపే లావాదేవీలకు వర్తించవని తాజాగా వివరణ ఇచ్చాయి. క్యాష్ డిపాజిట్ మెషీన్లలోనూ తొలి నగదు డిపాజిట్ ఉచితంగానే ఉంటుందని తెలిపాయి.
నాలుగు నగదు లావాదేవీలు దాటితే చార్జీలు వర్తిస్తాయని బుధవారం ఈ బ్యాంకులు అంతర్గత సర్క్యులర్లు జారీ చేసినా.. అందులో ఏటీఎంలలో లావాదేవీలపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఆ బ్యాంకు అధికారులు వివరణ ఇచ్చారు. అలాగే.. సీనియర్ సిటిజన్లు, మైనర్ల ఖాతాల లావాదేవీలపై ఎలాంటి పరిమితులు ఉండవని, వీరు గతంలోవలె ఎన్నిసార్లైనా బ్యాంకుల్లో నగదు డిపాజిట్, వితడ్రాయల్ చేసుకోవచ్చునని వెల్లడించాయి.
ఖాదాదారులపై అలాంటి చార్జీల విధింపు వారిపై ఆర్థిక ఉగ్రవాదాన్ని మోపడమే అవుతుందని, సామాన్య ప్రజలను బ్యాంకుల దయాదాక్షిణ్యాలకు వదిలేయడమే అవుతుందని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో రిజర్వ్ బ్యాంకు ఈ అదనపు వడ్డింపులపై నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు.