పెంపుడు కుక్క కోసం.. బిజినెస్‌ క్లాస్ క్యాబిన్‌ మొత్తాన్ని బుక్‌ చేశాడు..

శనివారం, 18 సెప్టెంబరు 2021 (20:35 IST)
Dog
పెంపుడు కుక్క కోసం దాని యజమాని ఎయిర్‌ ఇండియా బిజినెస్‌ క్లాస్ క్యాబిన్‌ మొత్తాన్ని బుక్‌ చేశాడు. దీంతో ఆ బొచ్చు కుక్క ఎంతో దర్జాగా, లగ్జరీగా బుధవారం ఉదయం విమానంలో ముంబై నుంచి చెన్నైకి ప్రయాణించింది. ఎయిర్‌ ఇండియా బిజినెస్‌ క్లాస్‌లో గతంలో కూడా పెంపుడు కుక్కలు ప్రయాణించాయి. అయితే ఒక పెంపుడు కుక్క కోసం బిజినెస్‌ క్లాస్‌ మొత్తాన్ని బుక్‌ చేయడం ఇదే తొలిసారి.
 
సాధారణంగా ఎయిర్‌ ఇండియా ఏ320 విమానంలోని జే-క్లాస్‌లో 12 సీట్లు ఉంటాయి. ముంబై నుంచి చెన్నైకి బిజినెస్‌ క్లాస్‌ సీటు ఛార్జీ సుమారు రూ.20,000. ఈ లెక్కన పెంపుడు కుక్క రెండు గంటల ప్రయాణం కోసం మొత్తం బిజినెస్‌ క్లాస్ బుక్‌ చేసిన ఆ యజమాని రూ.2.5 లక్షలకుపైగా ఖర్చు చేశాడు.
 
కాగా, దేశంలో పెంపుడు జంతువులను అనుమతించే ఏకైక విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా మాత్రమే. గరిష్ఠంగా రెండు పెంపుడు జంతువులను మాత్రమే అనుమతిస్తారు. సంబంధిత క్లాస్‌లోని చివరి వరుస సీటులో వాటిని కూర్చొనిస్తారు. మరోవైపు గత ఏడాది జూన్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్య ఎయిర్‌ ఇండియా డొమస్టిక్‌ విమానాల్లో రెండు వేల పెంపుడు జంతువులు ప్రయాణించినట్లు ఆ సంస్థ పేర్కొంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు